సీజనల్ వ్యాధులను అరికట్టాలి
పల్లె ప్రగతి పెండింగ్ పనులు పూర్తి చేయాలి
గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
వరంగల్రూరల్ కలెక్టరేట్ నుంచి
జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
వరంగల్రూరల్, జూన్ 16 (నమస్తేతెలంగాణ) : పల్లెలు, పట్టణాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. స్థానిక సంస్థల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సీజనల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై బుధవారం మంత్రి ఎర్రబెల్లి వరంగల్రూరల్ కలెక్టరేట్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. వివిధ పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులందరూ అంకితభావంతో పని చేయాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమై సుమారు ఏడాదిన్నర కావొస్తున్నదని, ఈ పథకం అమలుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన కృషితో గ్రామాలు ప్రగతిబాటన పయనిస్తున్నాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో కష్టపడి చక్కని ఫలితాల సాధించాలని ఆయన కోరారు.
గ్రామాల్లో ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రతలపై దృష్టి సారిం చాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, జిల్లాల్లో గతంలో నాటిన మొక్కల్లో దాదాపు 85 శాతం బతికాయని, గ్రామాల్లోని ప్రతి నర్సరీలో అన్ని రకాల మొక్కలు ఉండేలా చూడాలని చెప్పారు. గ్రీనరీ కోసం గ్రీన్ బడ్జెట్ వినియో గించాలని, ప్రధానంగా పల్లె ప్రకృతి వనాలకు అవసరమైన మొక్కలు సమకూర్చుకోవాలని సూచించారు. పరిశుభ్రతలో భాగంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీలను సమకూర్చినందున గ్రామాల్లో ప్రతిరోజు చెత్తను సేకరించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి కోరారు. పల్లెల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, దీనిపై ఇంటింటికీ అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కొన్ని గ్రామాల్లో వైకుంఠదామాల నిర్మాణాలు పూర్తికాలేదని, అసంపూర్ణంగా ఉన్న వైకుంఠధామాల నిర్మాణాన్నింటిని పదిహేనురోజుల్లోగా పూర్తి చేయాలని ఎర్రబెల్లి ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్నతాధికారులు పల్లెనిద్ర నిర్వహించి గ్రామాల సమస్యలు తెలుసుకోవాలని దయాకర్రావు కోరారు.
అదనపు కలెక్టర్లకు ప్రాధాన్యం : సీఎస్
జిల్లాల్లో క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు పాధాన్యం కల్పిస్తున్నామని, వారికి కొత్తగా వాహనాలు సైతం అందించామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా వారి వద్ద రూ.25 లక్షలు అందుబాటులో పెడుతున్నామని, నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాల్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గది పక్కనే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గది ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అదనపు కలెక్లర్లు, జిల్లా పంచాయతీ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని, గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పల్లె ప్రగతి, మొక్కల సంరక్షణను పరిశీలించాలని, అవసరమైన గ్రామాల్లో పల్లె నిద్ర చేసి సమస్యలు తెలుసుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ప్రతి నెల కనీసం 25 గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో సైతం పల్లె ప్రకృతి వనం వంటి అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలని, ప్రతి మున్సిపాలిటీలో కేటాయిస్తున్న 10 శాతం గ్రీన్ బడ్జెట్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సోమేశ్కుమార్ సూచించారు. పట్టణాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆశయాలను స ర్పంచ్లకు, కిందిస్థాయి ఉద్యోగులకు తెలియ జేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లను ఎర్రబెల్లి ఆదేశించారు.
ప్రతి జిల్లాలో మెగా నర్సరీలు
వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ఏడో విడత హరితహారానికి సన్నద్దం కావాలని, జిల్లాల్లో లక్ష్యాల మేరకు మొక్కలను సిద్ధం చేసుకోవాలని సోమేశ్కుమార్ కోరారు. హరితహారం ప్రారంభించిన పదిహేను రోజుల్లో మొక్కలు నాటడం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో పది లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా మూడు మెగా నర్సరీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో 30 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చెప్పారు. ప్రత్యేక ఆహార శుద్ధి కేంద్రాల స్థాపన కోసం ప్రతి జిల్లాలో 150 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని, ఈ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి భూమి వివరాలను ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతి పరిశీలించేందుకు జూన్ 20 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటనలుంటాయని, ఈ నేపథ్యంలో అలసత్వం వహించినట్లు వెల్లడైతే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమేశ్కుమార్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ హరిసింగ్, జిల్లా అటవీ అధికారి అర్పణ తదితరులు పాల్గొన్నారు.