హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: రాష్ట్రంలో హైరిస్క్ గ్రూప్నకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. శనివారం మొత్తంగా 1.10 లక్షల మందికి టీకాలు వేసినట్టు ఆదివారం వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇందులో 82 వేల మందికి తొలిడోస్ ఇవ్వగా, 28 వేల మందికి రెండో డోస్ వేశారు. దీంతో రాష్ట్రంలో వ్యాక్సిన్లు తీసుకున్నవారి సంఖ్య 60 లక్షలకు చేరువైంది. మొదటి డోస్ తీసుకున్నవారి సంఖ్య 45 లక్షలు దాటింది.
16,840 మంది ఆర్టీసీ సిబ్బందికి టీకాలు
రాష్ట్రంలో తొలిరోజు 16,840 మంది ఆర్టీసీ సిబ్బందికి కొవిడ్ టీకాలు వేశామని ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ చెప్పారు. ఎంజీబీఎస్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆదివారం వైద్యాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సునీల్శర్మ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 30 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిత్యం విధి నిర్వహణలో ప్రజలతో మమేకమయ్యే డ్రైవర్లు, కండక్టర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్లో 45 ఏండ్ల పైబడినవారందరూ టీకాలు తీసుకోగా.. ఇప్పుడు 18 నుంచి 44 ఏండ్లవారికి మొదటిడోసు టీకాలు వేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట డీఎంహెచ్వో డాక్టర్ వెంకట్, హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఈడీ మునిశేఖర్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, నాంపల్లి తాసిల్దార్ రామకృష్ణ తదితరులున్నారు.