రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ సిద్ధమవుతున్నది. మొత్తం గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా తుదిరూపు దిద్దుకుంటున్నది. సంగారెడ్డి నుంచి భువనగిరిదాకా 158 కిలోమీటర్లు ఉత్తరందిశకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం రోడ్లు, జలవనరులు, గ్రామాలు, పట్టణాలు, గుట్టలు తగులకుండా.. పూర్తి మైదానప్రాంతం నుంచి వెళ్లేలా పాత అలైన్మెంట్లో మార్పులు చేస్తున్నది. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రత్యేక కమిటీద్వారా భూసేకరణకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. భూసేకరణకు అయ్యే వ్యయంలో సగం భరించడానికి సిద్ధమయింది. కేంద్రం సూచన మేరకు దక్షిణ భాగం 182 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్పై కూడా ట్రాఫిక్ స్టడీ చేస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారనున్న రీజినల్రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తరం దిశ అలైన్మెంట్ తుదిదశకు చేరుకున్నది. మొదటిదశలో సంగారెడ్డి- భువనగిరికి సుమారు 158 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్కు కేంద్రం నుంచి అనుమతి రావడంతో రాష్ట్ర యంత్రాంగం అలైన్మెంట్ ఫైనల్చేయడంపై దృష్టి సారించింది. 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు మొత్తం గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ను ఖరారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గతంలో రూపొందించిన ప్రతిపాదనలను మరోసారి పరిశీలించి.. అవసరమైన మార్పులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఆర్ఆర్ఆర్ ప్రాముఖ్యతను ప్రధాని
నరేంద్రమోదీ, ఉపరితల రవాణామంత్రి నితిన్గడ్కరీకి వివరించిన సీఎం కేసీఆర్.. పట్టుబట్టి దానిని సాధించారు. మొదటిదశలో భాగంగా ఉత్తరదిశలో 158 కిలోమీటర్ల రోడ్డుకు ఆమోదం తెలిపిన\ కేంద్రం.. దక్షిణదిశ రో డ్డు కోసం ట్రాఫిక్ స్టడీరిపోర్ట్ ఇవ్వాలని కోరింది. రిపోర్ట్ నివేదించాక దక్షిణ దిశకు కూడా అనుమతి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
జనావాసాలు, జలాశయాలను తప్పిస్తూ..
రీజినల్ రింగ్రోడ్డుపై 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అలైన్మెంట్ను రూపొందించగా.. కేంద్రం పలు మార్పులు చేసింది. రాష్ట్రం కూడా వాటిని అంగీకరించింది. మూడేండ్ల క్రితం రూపొందించిన అలైన్మెంట్లో అక్కడడక్కడా రాష్ట్రప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. తాజాగా సంగారెడ్డి నుంచి భువనగిరి వరకు 158 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్కు ఆమోదం లభించడంతో అభివృద్ధి జరిగిన ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఆలైన్మెంట్ను రూపొందించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు 340 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్కు గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్చేయాలని భావిస్తున్న ప్రభుత్వం పాత ప్రతిపాదనలపై కొన్ని మార్పులు చేస్తున్నది. ఆర్ఆర్ఆర్ ఎక్కడ కూడా పాతరోడ్డు, జలవనరు లు, గ్రామాలు, పట్టణాలు, గుట్టలు తగులకుండా.. పూర్తి మైదాన ప్రాంతం నుంచి వెళ్లేలా అలైన్మెంట్లో మార్పు లు చేస్తున్నది. పాత అలైన్మెంట్లో గజ్వేల్ వద్ద గజ్వేల్ రింగ్రోడ్డు, యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపూర్ రిజర్వాయర్ వచ్చాయి. అలాంటి వాటన్నింటినీ తప్పి స్తూ తుది అలైన్మెంట్ రూపొందిస్తున్నామని రోడ్లు భవనాలశాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి తెలిపారు. రూపొందించిన తుది అలైన్మెంట్ను కేంద్రానికి పంపిస్తామని.. అనుమతి రాగానే పనులు మొదలువుతాయని చెప్పారు.
భూసేకరణ కోసం కసరత్తు
ఆర్ఆర్ఆర్ భూసేకరణ కోసం కాంపిటేటివ్ అథారిటీని నియమించాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ చర్యలు చేపట్టారు. భూసేకరణకు సీనియ ర్ అధికారిని నియమించి, క్షేత్రస్థాయిలో జిల్లాలవారీగా డిప్యూటీ కలెక్టర్లను అటాచ్చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చించారు. ఉత్తరదిశలో 158 కిలోమీటర్లు, దక్షిణదిశలో 182 కిలోమీటర్లు కలిపి ఆర్ఆర్ఆర్ మొత్తం 340 కిలోమీటర్లు ఉంటుంది. 8 లేన్ల మెయిన్ క్యారేజీవే, నాలుగులేన్ల సర్వీస్రోడ్డు, జంక్షన్లకు సరిపడా 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఉత్తరదిశకు 4 వేలు, దక్షిణ దిశకు ఐదువేలు కలిపి మొ త్తం 9వేల ఎకరాలు సేకరించాలని అంచనా. భూసేకరణ కోసం కిలోమీటర్కు రూ.10 కోట్లుగా అంచనావేస్తున్న అధికారులు.. రూ.3,400 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే భూసేకరణకు అయ్యే వ్యయంలో సగం భరించడానికి సిద్ధమైంది. కేంద్రం సూచన మేరకు దక్షిణ భాగం 182 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్పై ట్రాఫిక్ స్టడీ చేస్తున్నది. ఈ ఏడాది చివరికల్లా రెం డోదశకు అనుమతి లభిస్తుందన్న ఆశాభావంతో అధికారులు ఉన్నారు.