లండన్: దీపావళి పండుగ కోసం లక్ష్మీ దేవత బొమ్మతో రాయల్ మింట్ రూపొందించిన 20 గ్రాముల బంగారు బిస్కెట్ అమ్మకాలు మంగళవారం బ్రిటన్లో మొదలయ్యాయి. కార్డిఫ్లోని స్వామి నారాయణ్ ఆలయం సహకారంతో రాయల్ మింట్ డిజైనర్ ఎమ్మా నోబుల్ ఈ బంగారు బిళ్లను డిజైన్ చేశారు. సాంస్కృతిక వైవిధ్యానికి పట్టం కట్టే ఉద్దేశంతో సంప్రదాయానికి భంగం కలగని రీతిలో దీనిని తయారు చేసినట్టు రాయల్ మింట్లో ఖరీదైన లోహాల విభాగం అధికారి ఆండ్రూ డిక్కీ తెలిపారు. స్వామి నారాయణ్ ఆలయానికి చెందిన నీలేశ్ కబరియాతో కలిసి పనిచేయడం చాలా సంతోషమని చెప్పారు. సౌందర్యం, సంప్రదాయానికి కొంత ఆధునికత మేళవించి తయారు చేసిన బంగారుబిళ్ల పండుగ సమయంలో కానుకగా ఇచ్చుకునేందుకు బాగుంటుందనే ఉద్దేశంతో విడుదల చేశామని వివరించారు. ఒక్కో బంగారు బిస్కెట్ను 1,080 పౌండ్లకు విక్రయిస్తున్నారు. రాయల్ మింట్ వెబ్సైటులో దీనిని కొనుగోలు చేయవచ్చు. గత ఏడాది 1 గ్రాము, 5 గ్రాముల బిళ్లలను విడుదల చేశారు.