వాషింగ్టన్: అమెరికాలో దీర్ఘకాలికంగా కరోనాతో బాధపడుతున్న వారికి డిజేబిలిటీ బెనిఫిట్స్ వర్తింపజేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో దీర్ఘకాలికంగా కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులను ఆ దేశ వికలాంగుల చట్టం పరిధిలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అమెరికాలో వికలాంగుల చట్టం 31వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన తీసుకున్న ఈ ప్రత్యేక నిర్ణయం ప్రకారం.. దేశంలో ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి (డిజేబిలిటీ ఉన్నవారికి) ఉద్యోగం, తదితర అంశాల్లో అందుతున్న బెనిఫిట్సే దీర్ఘకాలిక కొవిడ్ రోగులకూ వర్తించనున్నాయి.
ఈ విషయాన్ని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ తమ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నాయి. కొన్ని వారాలు లేదా నెలల తరబడి కరోనాతో బాధపడుతున్నవారిలో అలసట, గుండె దడ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, బ్రెయిన్ ఫాగ్, ఏకాగ్రత మందగించడం వంటి లక్షణాలు తలెత్తుతున్నాయని ఆ మార్గదర్శకాల్లో ప్రస్తావించారు. దాంతో వాళ్లు కూడా దివ్యాంగుల మాదిరిగానే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే వారికి దివ్యాంగులకు కల్పించిన బెనిఫిట్స్ కల్పించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
అయితే, దీర్ఘకాలిక కొవిడ్ రోగులు డిజేబిలిటీ చట్టం పరిధిలోకి రావాలంటే తమలో దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.