యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగిలో పెద్ద ఎత్తున తరలివస్తున్న వరి ధాన్యం దిగుబడుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లాలో ఏర్పాట్లు చేసింది. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 2.40లక్షల హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. ఈ మేరకు 4.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికార యంత్రాంగం అంచనా వేస్తుండగా.. 4.70లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగాను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 98 కేంద్రాలు, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 186 కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకల్పించి ఇప్పటివరకు 231 కేంద్రాల్లో కొనుగోళ్లను ప్రారంభించారు. ఇప్పటి వరకు 3,801 రైతులకు సంబంధించిన 34,468 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా… మిల్లర్ల కొర్రీలు, లారీల కొరత వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుండటం.. రైతులను ఆందోళన కలిగిస్తోంది.
తూకాలు అయినా.. ఎగుమతులు లేక
వివిధ కారణాలతో కొన్నిచోట్ల ధాన్యం కొనుగోళ్లకు నోచుకోక కల్లాల వద్దే నిల్వలు భారీగానే ఉండిపోయాయి. కానీ.. మరికొన్ని చోట్ల ధాన్యం తూకాలు అయినప్పటికీ.. మిల్లులకు తరలించడంలో నెలకొన్న జాప్యం వల్ల కేంద్రాల వద్దే భారీగా నిల్వలు పేరుకుపోయాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు 28 మిల్లులకు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ధాన్యం రవాణా కోసం ఐదు బ్లాకుల పరిధిలో 225 లారీలు ఏర్పాటు చేశారు. గ్రేడ్ ‘ఏ’ ధాన్యాన్ని క్వింటాల్కు రూ.1,888 చొప్పున, గ్రేడ్ ‘బి’ ధాన్యానికి రూ.1,868 చొప్పున మద్దతు ధరను ప్రభుత్వం కల్పిస్తున్నది. అయితే జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతులు 799 రకానికి చెందిన వరిని పండించారు. ఈ రకం ధాన్యాన్ని గ్రేడ్ ‘బి’ కింద పరిగణిస్తుండటం.. తాలు సమస్య ఉందని మిల్లర్లు కొర్రీలు పెట్టడం వంటి సంఘటనలు రైతుల ఆందోళనకు కొంత కారణమవుతోంది.
గత యేడాది వివిధ కారణాలతో మోత్కూరు పరిధిలోని రామకృష్ణ, పరమేశ్వరి శ్రీనివాస్, భూదాన్పోచంపల్లి పరిధిలోని కనకదుర్గ రైస్ మిల్లులకు ధాన్యం ఎగుమతులు నిలిపివేశారు. ప్రస్తుత యాసంగిలోనూ ఈ మిల్లులకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ రెండు ప్రాంతాల్లోని ధాన్యాన్ని ధనలక్ష్మి మిల్లుకే తరలిస్తుండడం.. సదరు మిల్లు యజమాని అభ్యంతరం చెబుతుండటంతో తూకం చేసిన ధాన్యం ఎగుమతుల్లో జాప్యం నెలకొంది. ఈ రెండు మండలాల పరిధిలోనే సుమారు 5,200 టన్నుల ధాన్యం కొనుగోళ్లకు నోచుకోక కల్లాల వద్దే నిల్వలు పేరుకుపోయాయి. మరో 3వేలకు పైగా టన్నుల ధాన్యం తూకాలు పూర్తయినప్పటికీ మిల్లులకు ఎగుమతి చేయడంలో నెలకొన్న జాప్యం కారణంగా కేంద్రాల వద్దే ఉండిపోయాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా పలుచోట్ల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో పండించిన ధాన్యాన్ని ధనలక్ష్మి మిల్లుకే తరలించడంతో ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు సదరు మిల్లరు అభ్యంతరం చెప్పాడు. ధాన్యం లోడుతో వెళ్లిన లారీలను మిల్లు బయటే నిలుపాల్సి రావడంతో బుధవారం కొద్దిసేపు మిల్లువద్ద ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెం దిన ధాన్యాన్ని కొనుగోళ్ల అనంతరం 34 కి.మీ.ల దూరంలో ఉన్న బాలాజీ, సాయి శ్రీనివాస్ రైస్ మిల్లులకు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతదూరంలో ఉన్న మిల్లుల్లో ధాన్యాన్ని అన్లోడ్ చేసి వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతుండడం.. రవాణా ఖర్చు కింద ప్రభుత్వం క్వింటాల్కు చెల్లిస్తున్నా రూ.240 గిట్టుబాటు కావడం లేదన్న నెపంతో లారీల కొరత నెలకొంటున్నది.
భువనగిరి మండలం చందుపట్ల పీఏసీఎస్ పరిధిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలిస్తున్న మిల్లు యాజమాన్యం కొర్రీలు పెట్టి బస్తాకు 2కిలోల తరుగు తీస్తున్నదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు అన్నీ పరిశీలించిన తర్వాతే మిల్లులకు ధాన్యాన్ని పంపిస్తున్నప్పటికీ.. మిల్లర్లు వివిధ సాకులు చూపి మూడు, నాలుగు రోజులపాటు గేటు వద్దనే లారీలను ఉంచిన తర్వాతే అన్లోడ్ చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.
కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యం లోడుతో వెళ్లిన లారీలు అన్లోడ్ చేసి వచ్చే వరకు రెండు, మూడు రోజుల సమయం పడుతుండడంతో లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదని మోటకొండూరు, గుండాల, చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, వలిగొండ మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రామన్నపేట మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో హమాలీలు లేని కారణంగా బుధవారం ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి.
ఆత్మకూరు(ఎం) మండలంలో పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఇంకా 90వేల క్వింటాళ్లు, ఐకేపీ ఆధ్వర్యంలో మరో 8వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు తూకాలకు నోచుకోక పేరుకుపోయాయి. మిల్లర్లు ఇబ్బందులు పెడుతుండడమే ఇందుకు కారణమని రైతులు పేర్కొంటున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఏ రకమైన ఆందోళన చెందవద్దు. ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తాలు విషయంలో కొన్నిచోట్ల మిల్లర్లు అభ్యంతరం చెబుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. లారీల కొరత రాకుండా సంబంధిత యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించనున్నాం. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
-అనితారామచంద్రన్, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా