రిజర్వాయర్లోకి దిగనున్న 1,350 మంది మత్స్యకారులుకూసుమంచి, జూన్ 12 : జిల్లాలోనే అతి పెద్దచెరువు పాలేరులో ఈ ఏడాది చేపలు, రొయ్యల వేటకు సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి మత్స్యకారులు రిజర్వాయర్లోకి దిగనున్నారు. 1,350 మంది మత్స్యకారులు, అనధికారికంగా మరో 200 మంది సుమారు 1,550 మంది వరకు పాలేరులో చేపల వేట సాగించనున్నారు. అయితే ఆదివారం చెరువులో చేపల వేట ప్రారంభించాల్సి ఉండగా తుఫాను కారణంగా ఈ నెల 15కు వాయిదా వేశారు. ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాలైన పాలేరు, నాయకన్గూడెం, జుఝల్రావుపేట, గుర్వాయిగూడెం, పోచారం, కిష్టాపురం, నర్సిహులగూడెం, ఎర్రగడ్డ, కొత్తూరు, దుబ్బతండా, నానుతండా, నారాయణతండా, గుర్వాయిగూడెంతండా చౌటపల్లి, ఉడతలగూడెం, గైగోళ్లపల్లి, సంధ్యాతండా, లాల్సింగ్తండా, పూర్యాతండా, బడమీదతండాలతోపాటు మరికొన్ని గ్రామాల్లో మత్స్య సహకార సంఘంలో సభ్యత్వాలు కలిగిన వారు చేపలు, రొయ్యల వేటకు దిగనున్నారు. సూర్యాపేట జిల్లా మోతె మండలంతోపాటు సుమారు 8 గ్రామాలకు చెందిన మత్స్య సహకార సంఘం సభ్యులు వేటకు దిగనున్నారు. రొయ్యలు పెద్దవి కేజీ రూ.230 చిన్నసైజు రొయ్యలు రూ.140కి నాయకన్గూడెంలో కొనుగోలు చేస్తారు. చేపలు మత్స్యకారులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పట్టుకోవచ్చు. అయితే రోయ్యలను నాయకన్గూడెంలోని రొయ్యల కొనుగోలు కేంద్రానికే ఇవ్వాలని మత్స్యసహకార సంఘం సభ్యులు తీర్మానించారు. 15వ తేదీ నుంచి పాలేరు తీరం మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులతో సందడిగా మారనున్నది.