భద్రాద్రి కొత్తగూడెం : హైదరాబాద్కు అక్రమంగా రవాణా చేస్తున్న 22 క్వింటాళ్ల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి పోలీసులు మంగళవారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అరెస్టు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడటం రాష్ట్రంలో బహుశా ఇదే మొదటిదని అధికార వర్గాలు తెలిపాయి.
కేసు వివరాలను ఎస్పీ సునీల్ దత్ మీడియా ద్వారా వెల్లడించారు. చుంచుపల్లి ఎస్ఐ బి.మహేశ్, ఇతర సిబ్బంది కొత్తగూడెం సమీపంలోని బృందావన్ గ్రామంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనంలో నిషేధిత గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. 3.31 కోట్లుగా సమాచారమన్నారు.
వాహన డ్రైవర్ హైదరాబాద్లోని టోలిచౌకీ నివాసి షేక్ మహబూబ్ అని తెలిపారు. ఎండు గంజాయి సంచులను వ్యాన్లో ఖాళీ కూరగాయల ట్రేల కింద దాచి రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు. డ్రైవర్ను అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.