బెంగళూర్ : కొత్త జీవితంపై కోటి ఆశలతో మెట్టినింట నవవధువు అడుగు పెట్టగానే భర్త మొదటి భార్య ఇద్దరు పిల్లలతో ఊడిపడటంతో యువతి విస్తుపోయింది. అప్పటికే పెండ్లయిన విషయాన్ని దాచి భర్త తనకు తాళికట్టి మోసం చేశాడని బెంగళూర్ దేవనహళ్లికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూర్ వైట్ఫీల్డ్కు చెందిన ప్రైవేట్ కాలేజ్ ప్రొఫెసర్ మూర్తి అలియాస్ మూర్తన్నతో బాధితురాలికి గత ఏడాది సెప్టెంబర్లో పరిచయం ఏర్పడింది.
పరిచయం స్నేహంగా మారడంతో తాను బ్యాచ్లర్నని యువతికి నమ్మబలికి పెండ్లి చేసుకుంటానని కోరాడు. యువతి తల్లితండ్రులతో మాట్లాడటంతో వీరికి వివాహం జరిగింది. ఈనెల 15న దేవనహళ్లిలోని ఆలయంలో బాధితురాలితో నిందితుడు మూర్తి వివాహం జరిగింది. రెండ్రోజుల తర్వాత ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ యువతి మెట్టినింటికి చేరింది. తాను మూర్తి మొదటి భార్యనని, ఇద్దరు పిల్లలు తమ సంతానమని చెప్పడంతో యువతి విస్తుపోయింది. దీంతో భర్త మూర్తిపై ఆమె చీటింగ్ కేసు దాఖలు చేసింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన బెంగళూర్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.