సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ ) : ఈసారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్, జంబో బాక్స్ ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఓటు వేసేందుకు వచ్చిన పట్టభద్రులు వాటిని తదేకంగా పరిశీలించారు. దినపత్రిక సైజులో బ్యాలెట్ పేపర్ ఉండటంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో లేని విధంగా పెద్ద సైజులో బ్యాలెట్ పేపర్ ఉండటం, రెండు అడుగుల వెడల్పు, రెండు అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తు (610MMX610MMX760MM) ఉండేలా జంబో బాక్స్లు ఉండటంతో ఓటర్లు వాటిని ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో నిలవడంతో బ్యాలెట్ పేపర్ పెద్దగా ఉంది. ఇంత పెద్ద సైజులో బ్యాలెట్ పేపర్పై ఓటు వేయడం నగరవాసులకు ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో ఈ తరహా బ్యాలెట్ పేపర్ లేదు. బ్యాలెట్ పేపర్ సైజు పెద్దగా ఉండటంతో నాలుగు మడతలు వేసి సిబ్బంది ఇవ్వడంతో స్కెచ్తో నచ్చిన అభ్యర్థికి ఎదురుగా ప్రాధాన్యత నంబర్ వేసి ఓటు వేసిన అనంతరం తిరిగి అలాగే మడత పెట్టి బ్యాలెట్ బాక్స్లో వేశారు. ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ.. కొత్త అనుభూతిని కలిగించిందని ఓటర్లు తెలిపారు.