కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడాన్ని రష్యా కూడా అధికారికంగా స్వాగతించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఆ దేశ రాయబారి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం కంటే తాలిబన్ల హయాంలోనే కాబూల్ పరిస్థితి మెరుగ్గా ఉన్నదని ఆఫ్ఘనిస్థాన్లో రష్యా రాయబారి దిమిత్రీ జిర్నోవ్ అనడం గమనార్హం. కాబూల్ను వాళ్లు ఆక్రమించిన తొలి రోజును బట్టి నేను చెబుతున్నాను. పరిస్థితి మెరుగ్గా ఉంది. అష్రఫ్ ఘనీ ఉన్నప్పటి కంటే ఇప్పుడే కాబూల్ బాగుంది అని జిర్నోవ్ అన్నారు. కాబూల్లోకి తాలిబన్లు వచ్చినప్పుడు వాళ్ల చేతుల్లో ఆయుధాలు లేవని ఆయన చెప్పారు. అంతేకాదు వాళ్లు రాగానే విదేశీ రాయబార కార్యాలయాల భద్రతకు హామీ ఇచ్చారని తెలిపారు.
ఇక ప్రజలకు వాళ్లు హాట్లైన్ ఫోన్లు ఇచ్చారని, ఎవరైనా దాడులకు, దోపిడీలకు పాల్పడితే వెంటనే తాలిబన్లకు ఫోన్ చేయాల్సిందిగా చెప్పారనీ జిర్నోవ్ వెల్లడించారు. వాళ్లు రాగానే నేరాలు జరగకుండా చూసుకున్నారని ప్రశంసించారు. ప్రస్తుతం కాబూల్లో పరిస్థితి ప్రశాంతంగా బాగుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కాబూల్లోని తమ దౌత్య కార్యాలయాల భద్రత కోసం తాలిబన్లతో మాట్లాడుతున్నామని రష్యా విదేశాంగ వెల్లడించింది.