మాంట్రియల్ : కెనడా ప్రధానిగా మూడవసారి జస్టిన్ ట్రూడో ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో తామే గెలిచినట్లు ఆయన ప్రకటించారు. కెనడాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోనున్నట్లు ఆయన చెప్పారు. లిబరల్ పార్టీ తరపున ట్రూడో ప్రధాని అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కన్జర్వేటి పార్టీ నుంచి ఆయనకు గట్టి పోటీ ఇచ్చింది. లిబరల్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచినా.. సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయింది. ట్రూడో తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఓటింగ్లో పాల్గొన్న కెనడన్లకు ట్రూడో థ్యాంక్స్ తెలిపారు. తన ట్విట్టర్లో ఆయన రియాక్ట్ అయ్యారు. లిబరల్ జట్టుపై నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ చెప్పారు. దివ్యమైన భవిష్యత్తును ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్పై పోరాటాన్ని ముగిస్తామన్నారు. కెనడాను ముందుకు తీసుకువెళ్లనున్నట్లు ట్రూడో తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ 170 సీట్లు కావాలి. అయితే తాజా సమాచారం ప్రకారం.. లిబరల్ పార్టీ 157 సీట్లలో విజయం సాధించింది. ఇక కన్జర్వేటి పార్టీ 122 స్థానాలను కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. నిజానికి మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ట్రూడో.. గత ఆగస్టులో మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లకే ఆయన ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే ఈసారి కూడా గెలిచినా.. ట్రూడో మాత్రం తాను అనుకున్నట్లు మెజారిటీ సాధించలేకపోయారు.
కెనడా చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చెబుతున్నారు. 2019లో గెలిచిన సీట్లతో పోలిస్తే, ఈ సారి మూడు సీట్లను లిబరల్ పార్టీ కోల్పోయింది. మెజారిటీ సాధించలేకపోయినా.. ట్రూడోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సంపూర్ణ మెజారిటీ లేకుండా ఏ పనీ పూర్తి చేయలేమన్న నమ్మకంతో ట్రూడో మళ్లీ ఎన్నికలకు వెళ్లారు.