వాషింగ్టన్, జూలై 19: అంతరిక్ష పర్యాటక రంగంలో మంగళవారం మరో కీలక అడుగు పడనున్నది. అపర కుబేరుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యానం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు వెళ్లనున్నారు. అందులో ఒకరు బెజోస్ సోదరుడు మార్క్. మరో ఇద్దరు.. అత్యంత ఎక్కువ వయస్సులో అంతరిక్ష యాత్ర చేయనున్న మాజీ పైలట్ వాలీ ఫంక్(82) కాగా, మరొకరు అంతరిక్ష యానం చేయనున్న అతి పిన్న వయస్కుడు ఆలివర్ డెమెన్(18). డెమెన్ రూ.209 కోట్లతో ఈ యాత్రలో సీటు సంపాదించుకొన్నారు. బెజోస్కే చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ తయారు చేసిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్లో వీరు అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. వ్యోమగాములు, పరిశోధకులు, శాస్త్రవేత్తలే కాకుండా మామూలు మనుషులకు కూడా అంతరిక్ష యాత్రలను దగ్గర చేయడమే ముఖ్య ఉద్దేశంగా బెజోస్ ఈ యాత్రను తలపెట్టారు. వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్, భారత సంతతికి చెందిన బండ్ల శిరీష ఇటీవల అంతరిక్ష యాత్ర చేసినప్పుడు కర్మన్ లైన్(భూ ఉపరితలానికి కనీసం 100 కిలోమీటర్ల ఎత్తు) దాటలేదని, కర్మన్ లైన్ దాటితేనే అంతరిక్ష యాత్ర అని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెజోస్ బృందం కర్మన్ లైన్ను దాటి రానున్నారు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు పశ్చిమ టెక్సస్ నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్ రోదసిలోకి వెళ్లనున్నది. ఇది అటానమస్ ఎయిర్ క్రాఫ్ట్. దీనిలో పైలట్ ఉండరు. దానికదే నడుస్తుంది. న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్లో మనుషులు ప్రయాణించడం ఇదే తొలిసారి. గతంలో ట్రయల్స్ నిర్వహించినప్పటికీ అందులో మనుషులు ప్రయాణించలేదు.