కొండాపూర్, మే 25 : చందానగర్లోని గోల్డు షాపులో జరిగిన చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. పలు మార్లు జైలుకు వెళ్లివచ్చినప్పటికీ బుద్ధి మార్చుకోకుండా.. గోల్డ్ షాపులు, ఫర్టిలైజర్స్ దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న గజదొంగ బిర్యానీ పాషాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం చందానగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. నాగర్కర్నూల్కు చెందిన సయ్యద్ మహబూబ్ పాషా అలియాస్ బిర్యానీ పాషా బంగారం దుకాణాలు, ఫర్టిలైజర్ షాపులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతుంటాడు. వచ్చిన డబ్బులతో కార్లను కొనుగోలు చేసి జల్సాలు చేస్తుంటాడు. కాగా మే 9న చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహన్ జ్యువెల్లర్స్లో జరిగిన చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో మంగళవారం గుల్మోహర్పార్కు చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న క్రైమ్ పోలీసులకు బిర్యానీ పాషా ఆనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పాషాను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.3.5 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, 4 కార్లు, ఖరీదైన సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కాగా పాషా దీంతో పాటు ఇప్పటి వరకు 13దొంగతనాలకు పాల్పడి రెండు మార్లు జైలు శిక్ష అనుభవించాడు. 2016లో కుషాయిగూడ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ను విధించి 14నెలలు జైలుకు పంపారు. 2019లో వనపర్తిలో పోలీసులకు పట్టుబడి పీడీ యాక్ట్తో పాటు 5నెలలు జైలు శిక్షను అనుభవించాడు. రెండుమార్లు జైలు శిక్ష అనుభవించినా.. బుద్ది మార్చుకోకుండా దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నాడు. ఇటీవల చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యువెల్లరీ షాపులో చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాదాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా పాషా పట్టుబడ్డాడు. నిందితుడిని పట్టుకోవడంలో కృషిచేసిన చందానగర్ ఇన్స్పెక్టర్ కాస్ట్రో, మియాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహేశ్, ఇతర సిబ్బందిని డీసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు.