టోక్యో: ఈ లోకంలో తరచూ ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు కొన్ని మనలను ఆశ్యర్యంలో ముంచెత్తుతాయి. మరికొన్ని అసలు నమ్మశ్యంగానే ఉండవు. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. జపాన్కు చెందిన ఓ హైస్కూల్ విద్యార్థులు ఎప్పుడో 37 ఏండ్ల క్రితం కాగితం మీద సందేశం రాసి, ఆ కాగితాన్ని సీసాలో పెట్టి సముద్రంలో విడిచిపెట్టారు. ఆ సందేశం 37 ఏండ్లలో 6,000 కిలోమీటర్లు ప్రయాణించి తాజాగా హవాయ్ బీచ్కు చేరుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. టోక్యో తూర్పు ప్రాంతమైన చీబాలోని చోసీ హైస్కూల్కు సంబంధించిన న్యాచురల్ సైన్స్ క్లబ్ సభ్యులు (విద్యార్థులు) 1984, 1985 ప్రాంతంలో సముద్ర ప్రవాహాలపై పరిశోధన కోసం మొత్తం 750 బాటిళ్లను సముద్రంలో విడిచిపెట్టారు. ఈ బాటిల్ ఎవరికి దొరికినా తమను సంప్రదించాలంటూ ఆ బాటిళ్లలోని కాగితాల్లో ఇంగ్లిష్, జపనీస్, పోర్చుగీస్ భాషల్లో సందేశాలు రాసి పెట్టారు. అలా సముద్రంలో వదిలేసిన బాటిళ్లు ఫిలిప్పీన్స్, కెనడా, అలస్కా ప్రాంతాలకు కొట్టుకుపోయాయి.
ఆ తర్వాత కొన్ని బాటిళ్లు కొందరికి దొరుకగా వాటిలోని సందేశాన్ని చదివి తిరిగి అప్పగించారు. అలా 2002లో చివరగా జపాన్లోని వాయవ్య ప్రాంతమైన కగోషిమాలో 50వ బాటిల్ దొరికింది. తాజాగా 51వ బాటిల్ హవాయ్లోని బీచ్లో తొమ్మిదేండ్ల బాలికకు దొరికిందని చోసి హైస్కూల్ ప్రకటించింది. దాదాపు 37 ఏండ్ల తర్వాత సందేశంతో కూడిన బాటిల్ దొరకడం ఆశ్చర్యకరంగా ఉన్నదని స్కూల్ వైస్ ప్రిన్సిపల్ జున్ హయాషీ తెలిపారు.
19 ఏండ్ల క్రితం 50వ బాటిల్ దొరికినప్పుడే ఇక మిగతా బాటిళ్లన్నీ ధ్వంసమై ఉంటాయనుకున్నానని, మరో బాటిల్ దొరుకుతుందని అస్సలు ఊహించలేదని లేదని హయాషీ చెప్పారు. బాటిళ్లన్నీ ధ్వంసమై నీళ్లలో మునిగిపోయి ఉంటాయని భావించానని చెప్పారు. అయితే, ఇప్పుడు మాత్రం 52వ బాటిల్ కూడా దొరుకుతుందేమో అనిపిస్తుందని తెలిపారు. అయితే, చోసీ స్కూల్లోని న్యాచురల్ సైన్స్ క్లబ్ను 2007లో మూసివేశారట.