సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ గుర్తించిన చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ విషయంలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ బాధ్యతలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ నుంచి తప్పించి అదనపు కలెక్టర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో ఎం.ఎస్.నం.74ను జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని చెరువుల సరిహద్దులు( ఎఫ్టీఎల్- ఫుల్ ట్యాంక్ లెవల్), చెరువు పరిధిలో ఉండే భూముల సర్వే నంబర్లను గుర్తించే బాధ్యతను సంస్థ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చూస్తోంది. దీంతో హెచ్ఎండీఏ గుర్తించిన చెరువుల నోటిఫికేషన్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. లేక్ ప్రొటెక్షన్ కమిటీతో నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు పూర్తిస్థాయిలో సమన్వయం లేకుండా పోవడమే ఇందుకు కారణం. దీంతో ఫైనల్ నోటిఫికేషన్ పూర్తి కాకుండా మిగిలిన చెరువుల ఎఫ్టీఎల్, సర్వే నంబర్ల గుర్తింపు బాధ్యతలను ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకనుగుణంగా హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ విభాగం అధికారులు హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల అదనపు కలెక్టర్లకు గుర్తించిన చెరువుల వివరాలను అందజేశారు. హైదరాబాద్ జిల్లాను మినహాయిస్తే గ్రేటర్ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, భువనగిరి యాదాద్రి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పరిధిలో ఉన్న చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయి.
హెచ్ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. మాస్టర్ప్లాన్లో గుర్తించిన జల వనరులైన చెరువులు, కుంటలు, వరదనీటి కాలువలను కబ్జా పెట్టి లే అవుట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. దీంతో వరద నీటి పారుదల వ్యవస్థ చిందరవందరమై చెరువుల్లోకి నీరు వెళ్లడం లేదు. దీన్ని అడ్డుకునేందుకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ గత కొన్నేండ్లుగా చెరువుల పరిరక్షణపై కసరత్తు చేస్తోంది. అయితే వారికి జిల్లా కల్టెకరేట్ పరిధిలోని నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖల నుంచి సరైన సహకారం లేకపోవడంతో చెరువుల పరిరక్షణ ఏండ్ల తరబడి పెండింగ్లోనే ఉంది. జల వనరులకు అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వాటి పరిరక్షణ కోసం ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించేలా నిబంధనలు రూపొందించి ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. అదనపు కలెక్టర్ల నేతృత్వంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు కలిసి చెరువులను పరిశీలించి వాటి ఎఫ్టీఎల్, సర్వే నంబర్లను గుర్తించి రూపొందించిన నివేదికను హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్కు పంపిస్తే వారు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటారు.