టోక్యో: మోడెర్నా కోవిడ్19 టీకాలకు జపాన్ బ్రేకేసిన విషయం తెలిసిందే. అయితే ఓ టీకా బుడ్డీలో నల్లటి రేణువులు కనిపించినట్లు ఇటీవల గుర్తించారు. కనగావా ప్రాంతంలో ఓ ఫార్మసిస్టు మోడెర్నా టీకా బుడ్డీలో బ్లాక్ పార్టికిల్స్ను పసికట్టింది. దీంతో ఆ టీకాల పంపిణీ నిలిపివేశారు. అయితే ఆ బ్యాచ్లో వచ్చిన టీకాలతో ఇప్పటికే 3790 మందికి టీకాలు వేశారు. ఆ బ్యాచ్కు చెందిన మిగితా టీకాలను ఆపేశారు. మోడెర్నా టీకాలు కలుషితం అయినట్లు ఇటీవల జపాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. సుమారు 1.63 మిలియన్ల మోడెర్నా డోసుల పంపిణీ నిలిపివేశారు.
వ్యాక్సిన్ వాడడానికి ముందు టీకా వయల్ను పరీక్షించగా, దాంట్లో నల్లటి పదార్ధాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ బుడ్డీలు కలుషితమైనట్లు స్వదేశీ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. కలుషిత వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ఆరోగ్య ఫిర్యాదులు రాలేదని తెలుస్తోంది. జపాన్కు చెందిన టకేడా ఫార్మసీ కంపెనీ.. మోడెర్నా టీకాలను స్థానికంగా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. వారం క్రితం సుమారు మూడు బ్యాచ్ల వ్యాక్సిన్ డోసులు కలుషితమైనట్లు తేలింది. ఆ బ్యాచ్ల్లో సుమారు ఆరు లక్షల టీకాలు ఉన్నట్లు అంచనా వేశారు.