రవీంద్రభారతి : ప్రపంచ రంగస్థలం దినోత్సవం సందర్భంగా తెలంగాణ సంగీత, నాటక అకాడమీ, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో రవీంద్రభారతిలో మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ రంగస్థల దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర సంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతిప్రజ్వలన చేసి గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో మరుగున పడిన కళలను రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కళలను వెలికి తీసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కళలకు పుట్టినిల్లువంటిదన్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్లు అందజేసి వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అంతరించిపోతున్న ప్రాచీన కళలకు జీవం పోసి వచ్చే తరానికి అందజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భవిష్యత్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నాటక రంగాన్ని ప్రోత్సహించి జిల్లాల్లో ఉన్న కవులను, కళాకారులను గుర్తించి వారికి చేయూతనిస్తామని చెప్పారు.
ప్రతి జిల్లాలో నాటక, సంస్కృతిక భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ సందర్భంగా మొదటి రోజు మూడు జిల్లాలకు చెందిన కళాకారులను మెమోంటోతో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ప్రొఫెసర్ ప్రదీప్కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన రంగస్థల దినోత్సవం సందర్భంగా భాగమతి ప్రణవగాద నాటకం ఎంతో అలరించింది.కార్యక్రమంలో తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కార్యదర్శి వసుంధర, రంగస్థల నటుడు కె. శివాజీ, కవులు, కళాకారులు పాల్గొన్నారు.