జెరూసలేం: ‘పెగాసస్’ నిఘా సాఫ్ట్వేర్ తయారీ సంస్థ అయిన ఎన్ఎస్వో గ్రూప్ కార్యాలయాన్ని ఇజ్రాయెల్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. పెగాసస్ సాఫ్ట్వేర్ ప్రపంచ వ్యాప్తంగా దుర్వినియోగమవుతున్నదని జర్నలిస్టుల అంతర్జాతీయ కన్సార్టియం ఆరోపించింది. ఈ నేపథ్యంలో పలు దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు టెల్ అవివ్ సమీపంలోని హెర్జిలియాలో ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్ కార్యాలయాన్ని తనిఖీ చేసినట్లు ఇజ్రాయోల్ రక్షణ మంత్రిత్వశాఖ బుధవారం ట్వీట్ చేసింది. పెగాసస్ స్పైవేర్తో మొబైల్ ఫోన్స్ హ్యాకింగ్కు సంబంధించి ఆ సంస్థపై వచ్చిన ఆరోపణలు, సంబంధిత ప్రచురణలను పరిశీలించినట్లు పేర్కొంది.
మరోవైపు తమ కార్యాలయంలో జరిగిన రైడ్స్ను ఎన్ఎస్వో గ్రూప్ కార్యాలయం ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పలువురు ప్రతినిధులు తమ కార్యాలయాన్ని సందర్శించినట్లు మీడియాకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ తనిఖీలను తాము ఆహ్వానిస్తున్నామని పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారులతో పూర్తి పారదర్శకతతో పనిచేస్తున్నట్లు తెలిపింది. ‘ఇటీవల మీడియా మాపై చేసిన తప్పుడు ఆరోపణలను కంపెనీ పదేపదే ఖండించింది. ఈ తనిఖీలు వాస్తవాలను తెలియజేయడంతోపాటు మా సంస్థపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపిస్తుందని మేము విశ్వసిస్తున్నాం’ అని ఎన్ఎస్వో గ్రూప్ వెల్లడించింది.
మరోవైపు పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్ కార్యాలయంలో ఇజ్రాయెల్ రక్షణ అధికారుల తనిఖీలు కంటితుడుపు చర్య అని ఈ విషయాన్ని ప్రచురించిన ఆ దేశానికి చెందిన కాల్కలిస్ట్ పత్రిక పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖ, ఆ సంస్థ మధ్య పరస్పర ప్రయోజనాలున్నందున ఎలాంటి చర్యలు ఉండబోవని అభిప్రాయపడింది. గతంలో కూడా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఆ సంస్థపై వచ్చిన విమర్శలు, న్యాయ వివాదాలను తమ అధికారంతో ఎదుర్కొన్నారని ఆ పత్రిక వెల్లడించింది.
కాగా, పెగాసస్ స్పైవేర్ ద్వారా మొబైల్ ఫోన్లు హ్యాక్ చేసిన 50,000 ఫోన్ నంబర్ల డేటా లీక్ అయిన సంగతి తెలిసిందే. జర్నలిస్టుల అంతర్జాతీయ కన్సార్టియం ఈ డేటాను ఫోరెన్సిక్ నిఫుణులతో పరిశీలింపజేసి ఆ వివరాలను బయటపెడుతున్నది. ఈ నేపథ్యంలో భారత్లోని పలు రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు ది వైర్ పేర్కొంది. వారి పేర్లను కూడా పలు దఫాలుగా వెల్లడించింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఈ అంశం కుదిపేస్తున్నది.