కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ను చేజిక్కించుకున్న తాలిబన్ ( Taliban )ఫైటర్లకు ఇప్పుడు మరికొన్ని ఉగ్ర సంస్థలు ఊతం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇస్లామిక్ స్టేట్, జేషే మొహమ్మద్, లష్కరే తోయిబా లాంటి సంస్థలకు చెందిన ఫైటర్లు ఆఫ్ఘన్లోకి ఎంటరైనట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి వాళ్లు దేశంలోకి ప్రవేశిస్తున్నారు. కాబూల్లో తాలిబన్ జెండాను పట్టుకుని తిరిగింది విదేశీ తీవ్రవాదులని గుర్తించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు ఉగ్ర సంస్థలకు చెందిన సాయుధులు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలు వాళ్ల ఆధీనంలోనే ఉన్నాయని అనుమానిస్తున్నారు.
నిజానికి అమెరికాతో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్లో ఎటువంటి ఉగ్ర గ్రూపులను తాలిబన్లు ప్రోత్సహించరాదు. అయితే మరికొన్ని రోజుల్లో ఆ ఉగ్ర గ్రూపులు కాబూల్ను విడిచి వెళ్తాయని భావిస్తున్నారు. లష్కరే, జేషే లాంటి సంస్థలు ఒకవేళ తాలిబన్ల ఆదేశాలను ఉల్లంఘిస్తే, అప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనున్నది.
కాబూల్లో ఆ ఉగ్రవాదులకు ఎటువంటి స్థావరం దక్కకుండా చూసేందుకు తాలిబన్ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్ వ్యవస్తాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకుబ్ ఈ కోణంలో పర్యవేక్షణ చేస్తున్నాడు. తాలిబన్లకు, విదేశీ మిలిటెంట్ల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని, ఉగ్ర గ్రూపులను అణిచివేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కొందరు తాలిబన్ నేతలంటున్నారు.