కాబూల్, ఆగస్టు 30: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్ రావణకాష్టంగా మారుతున్నది. కాబూల్లో ఉగ్రదాడులు నిత్యకృత్యమయ్యాయి. హమీద్ కర్జాయ్ విమానాశ్రయం లక్ష్యంగా సోమవారం ఉదయం రాకెట్ దాడులు జరిగాయి. అమెరికా దళాలు క్షిపణి రక్షణ వ్యవస్థ సాయంతో వాటిని కూల్చేశాయి. దుండగులు ఓ కారు నుంచి మొత్తం ఆరు రాకెట్లను ప్రయోగించారని, అమెరికా సేనలు వాటిని కాబూల్లోని సలీం కార్వాన్ ప్రాంతంలో కూల్చేశారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అనంతరం కారును కూడా పేల్చేశారని చెప్పారు. ఈ దాడులకు బాధ్యతవహిస్తూ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన ముష్కరుల వాహనాన్ని అమెరికా సేనలు ఆదివారం డ్రోన్ దాడులతో పేల్చేయడాన్ని తాలిబన్లు ఖండించారు. ఇది ఏకపక్ష నిర్ణయమని, అమెరికా చర్యలతో సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని, దాడులపై తమకు సమాచారం ఇవ్వాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్కు హాని తలబెట్టబోం: తాలిబన్లు
తాలిబన్ల నేతృత్వంలో అఫ్గాన్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారతదేశానికి ఏ విధంగానూ హాని తలబెట్టబోదని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు. భారత్తో గత ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నాయని, ఇకపై కూడా అవి కొనసాగుతాయన్నారు. మరోవైపు, అఫ్గాన్లో తాజా పరిస్థితులు భద్రతకు సంబంధించి కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
ఓ స్టూడియోలోకి చొరబడిన 8 మంది తాలిబన్లు అక్కడి న్యూస్ రీడర్ను బెదిరించారు. తుపాకులతో చుట్టూ చేరి తమకు అనుకూలంగా వార్తలు చెప్పాలని ఒత్తిడి చేశారు. భయంతో వణికిపోయిన ఆ న్యూస్ రీడర్ అలాగే చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
ఆంక్షల కొరడా
షరియా చట్టం ప్రకారమే అఫ్గాన్ విద్యాసంస్థల్లో నియమాలు ఉంటాయని విద్యా మంత్రిగా తాలిబన్లు ప్రకటించిన షేక్ అబ్దుల్బాకీ హక్కానీ తెలిపారు. దీని ప్రకారం పురుషులు, మహిళలు కలిసి చదువుకోకూడదని తెలిపారు. దేశవ్యాప్తంగా కో-ఎడ్యుకేషన్ను నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. బాలికలు, మహిళలకు పురుష ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించకూడదని ఆదేశాలు జారీ చేశారు.