రెబ్బెన, ఆసిఫాబాద్ రేంజ్లలోనిర్మించే అవకాశం
ఫోర్లేన్తో సంచారానికి ఇబ్బంది కలుగకుండా చర్యలు
పర్యావరణహిత వంతెనల నిర్మాణానికి ఆమోదం
త్వరలో స్థలాలను పరిశీలించనున్న అటవీ శాఖ అధికారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా నుంచి మహారాష్ట్రలోని చం ద్రాపూర్ జిల్లా వరకు నాలుగు వరుసల(ఫోర్లేన్) జాతీయ రహదారి-363 నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ రహదారి విస్తరణ ద్వారా పులుల సంచారానికి ఆటంకం కలుగుతుందని కేంద్ర అటవీ శాఖ భావిస్తున్నది. సాధారణంగా చంద్రాపూర్లోని తడోబా పులుల సంరక్షణ కేంద్రం నుంచి ప్రాణహిత తీరం వెంట మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్ రిజర్వు ఫారెస్టులోకి పులులు ప్రవేశించడం, జిల్లా లో కూడా సంచరించేందుకు ఆటంకం కలుగుతుందని తె లంగాణ అటవీ శాఖ కేంద్ర అటవీ శాఖకు లేఖ రాసింది. దీనికితోడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా లేఖ పంపింది. దీంతో పులుల సంచారానికి ఇబ్బంది కలుగకుండా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్రలోని పెంచ్ పెద్ద పులు ల అభయారణ్యంలో మాదిరిగా ఎకో బ్రిడ్జి (పర్యావరణహిత వంతెన)లను నిర్మించనున్నట్లు సమాచారం.
గతంలోనూ ప్రతిపాదనలు..
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో గల తడోబా అంధేరి టైగర్ రిజర్వు(టీఏటీఆర్) నుంచి తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న అడవులను కలుపుతూ ఉన్న టైగర్ కారిడార్కు పులుల సంచారం కోసం కనెక్టివిటీ పెంచేందుకు ప్రాణహితపై వంతెనలు నిర్మించాలని గతంలోనూ అధికారులు ప్రతిపాదనలు చేశారు. జిల్లా సరిహద్దులో దాదాపు 72 కిలోమీటర్ల మేర ప్రాణహిత ప్రవహిస్తోంది. తడోబా నుంచి పులులు జిల్లాలోనికి ప్రవేశించే బెజ్జూర్, దహెగాం మండలాల సరిహద్దుల్లో ప్రవహించే ప్రాణహితపై పర్యావరణ వంతెనల నిర్మాణాలకు గతంలో ప్రతిపాదించారు. బెజ్జూర్ అటవీ పరిధిలో సలుగుపల్లి వద్ద ఒక ప్రదేశాన్ని కూడా ఎంపిక చేశారు. తెలంగాణ నీటి పారుదలశాఖ కూడా అనుమతి ఇచ్చింది. కానీ.. నేషనల్ వైల్డ్లైఫ్ నుంచి అనుమతి లేకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. ఇటీవలి కాలంలో తడోబా అంధేరి టైగర్ రిజర్వు నుంచి పులులు జిల్లాలోనికి ప్రవేశించడం అధికమైంది. పులుల సంచారానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా తాజాగా పర్యావరణ వంతెనలు నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి.
జంతువుల సంచారానికి అనువుగా..
పులులు, ఇతర వణ్యప్రాణుల సంచారానికి ఆటంకాలు కలుగకుండా పర్యావరణ వంతెనల నిర్మాణాలు ఉంటాయి. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న నాలుగు లేన్ల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆసిఫాబాద్, రెబ్బెన అటవీ రేంజ్ పరిధిలో ఈ వంతెనలు నిర్మించే అవకాశాలు ఉన్నా యి. సుమారు 60 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. అడవులను విడదీస్తూ వెళ్లే జాతీయ రహదారిపై అటూ-ఇటూ అడవులను కలుపుతూ ఈ పర్యావరణ వంతెనలు ఉంటాయి. వంతెనపై సహజమైన అడవిని తలపించేలా చెట్లను, పొదలను పెంచేందుకు అనువుగా నిర్మాణాలు చేస్తారు. మహారాష్ట్రలోని పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళ్తున్న జాతీయ రహదారి-44ని సుమారు 16 కిలోమీటర్ల మేర పర్యావరణ హై లెవల్ వంతెన నిర్మించారు. అడవులకు ఎలాంటి నష్టం జరుగకుండా చేపట్టారు. వంతెన కింది నుంచి జంతువులు, పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అనువైన వాతావరణం కల్పించారు. ప్రస్తుతం మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణం వల్ల పులులు, ఇతర అటవీ జంతువుల సంచారానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పర్యావరణ వంతెనల నిర్మాణాలు జరుగనున్నాయి.
ఇవి కూడా చూడండి..
ముద్దు కోసం తండ్రి అనుమతి తీసుకున్న ప్రభాస్
నిఘా వైఫల్యం లేదు.. మావోయిస్టుల కట్టడికి బలగాలను పంపాం: ఛత్తీస్గఢ్ సీఎం