హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ నిమ్స్లో కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు. స్పీకర్, చైర్మన్ల సతీమణులు పుష్ప, అరుంధతి కూడా టీకా తీసుకున్నారు. మార్చి 3వ తేదీన వీరు మొదటి డోసు తీసుకున్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా టీకా విషయంలో ఎవరూ అపోహ పడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. తాను మొదటి డోసు తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ర్పభావాలు సంభవించలేదని స్పష్టం చేశారు. రాష్ర్ట ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.
మాస్క్ ధరించకపోతే రూ. 1000 జరిమానా, 2 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తారు. ఈ కఠిన నిబంధనలు మన మేలు కోసమే, ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలి అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలి. శానిటైజర్, సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి అని స్పీకర్ పోచారం సూచించారు.
ఇవి కూడా చదవండి..