టెహ్రాన్ : ప్రముఖ భారతీయ సంతతి రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్లో జరిగిన దాడి ఘటనలో తమ ప్రమేయం లేదని ఇరాన్ పేర్కొంది. శుక్రవారం న్యూయార్క్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో రష్దీ (75)పై ఓ యువకుడు కత్తితో దాడి చేయగా.. రష్దీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొన్నారు. దాడిలో ఆయనకు చాలా గాయాలయ్యాయని రష్దీ సన్నిహితులు తెలిపారు.
అయితే, ఘటనలో తమ పాత్ర లేదని ఇరాన్ విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. రష్దీపై దాడి చేసిన వ్యక్తి న్యూజెర్సీ నివాసి హదీ మటర్ (24)గా పోలీసులు గుర్తించారు. సదరు యువకుడు ఇరాన్కు మద్దతుదారు అని పలు నివేదికలు పేర్కొన్నారు. అతని ఫేస్బుక్ ఖాతాల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయతులా ఖొమేని మద్దతుదారుడుగా అధికారులు పేర్కొన్నారు.
రష్దీ రచించిన బుక్ ‘ది సాటానిక్ వెర్సెస్’కు వ్యతిరేకంగా ఖొమేని 1989లో రష్దీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 1988 నుంచి ఇరాన్లో రష్దీపై నిషేధం ఉన్నది. ‘ది సాటానిక్ వెర్సెస్’ కోసం ఆయన దైవదూషణకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇరాన్ అగ్ర నాయకులు అతని తల నరికివేస్తామని బెదిరించారు. అలా చేసిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు.