నిజాంసాగర్, మార్చి 29: కామారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల కమిషనర్కు ఎన్నికల ఖర్చులు అందజేయని వారు, వివిధ కారణాలతో రాజీనామా చేసిన వారు, మృతి చెందిన వారు ఉన్నారు. దీంతో ఖాళీ అయిన రెండు ఎంపీటీసీ స్థానాలతో పాటు ఐదు గ్రామాల సర్పంచ్ స్థానాలు, 74 వార్డులకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని అధికారులకు ఎస్ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి.
గ్రామాల్లో రాజకీయ వేడి
ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలతో పాటు వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో రాజకీయ సందడి మొదలు కానుంది. నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామ ఎంపీటీసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ సభ్యురాలు పార్టీ విప్ను ధిక్కరించి ఇతర సభ్యులతో కలిసి ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీనిపై ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో వైస్ ఎంపీపీ అప్పటి నుంచి ఇన్చార్జి ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు అయ్యాక ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగిరెడ్డిపేట మండలంలో రాజకీయ వేడి ప్రారంభమైంది.
ఎన్నికలు జరిగే స్థానాలు, గ్రామాలుఐదు సర్పంచ్ స్థానాలు ఇవే..
1) గాంధారి మండలం గౌరారం కలాన్. 2) గాంధారి మండలం జువ్వడి 3) జుక్కల్ మండలం మైభాపూర్. 4) లింగంపేట మండలం ఎల్లమ్మ తండా 5) పెద్దకొడప్గల్ మండలం పెద్దదేవిసింగ్తండా.సర్పంచ్ స్థానాలతో పాటు 74 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి తండాలో ఎస్టీ రిజర్వు ప్రకటించింది. దీంతో గత ఎన్నికల్లో ఎస్టీలు ఆ తండాలో లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాటేపల్లి తండాలో సర్పంచ్ స్థానంతో పాటు ఎనిమిది వార్డు లకు ఈసారి కూడా ఎన్నికలు జరగడం లేదు.
ఎంపీటీసీ స్థానాలు
1) నాగిరేడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి.
2) నిజాంసాగర్ మండలంలోని కొమలంచ
ఇవీ కూడా చదవండి..
ఇక జియో ఫైబర్ యూజర్లకు డిస్కవరీ ప్లస్ సేవలు ఫ్రీ
మలివిడత కరోనా ఫియర్స్.. 3 గంటల్లో రూ.4.6 లక్షల కోట్లు హరీ!