బ్రాజవిల్లే, సెప్టెంబర్ 20: ప్రపంచంలోనే అత్యంత లోతైన నది కాంగో నది. అమెజాన్ తర్వాత అత్యంత ప్రవాహ తీవ్రత ఉన్న నది కూడా ఇదే. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గుండా ఇది వెళ్తున్నది. నదికి చెరోవైపున బ్రాజవిల్లే, కిన్షాసా నగరాలు ఉన్నాయి. రెండింటి మధ్య ఇంటర్నెట్ అనుసంధానం లేదు. రెండు నగరాలను ఇంటర్నెట్ ద్వారా లింక్ చేయాలంటే కాంగో నది నుంచి కేబుల్ వైర్లు వేయడం తప్ప మార్గం లేదు. అది మానవ మాత్రుడికి సాధ్యం అయ్యే పని కాదు. నది తీవ్రత తక్కువ ఉన్న దగ్గర నుంచి వేద్దామంటే 400 కిలోమీటర్ల మేర తవ్వాలి. మరి ఏం చేసేది.. నదిలోపలి నుంచి కాదు నదిపై నుంచి, ఇంకా చెప్పాలంటే గాలిలోనే కాంతి కిరణాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ భావించింది. ప్రాజెక్టును ప్రారంభించింది. దానికి ‘తార’ అని పేరు పెట్టింది. విజయం సాధించింది.
20జీబీపీఎస్ వేగం
ఆల్ఫాబెట్ రహస్య పరిశోధన విభాగమైన ‘ఎక్స్’ ఈ తార ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా బ్రాజవిల్లే పట్టణంలో ఒక టెర్మినల్ నిర్మించారు. దానికి బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ ఇచ్చారు. ఆవలి వైపున కిన్షాసాలో మరో టెర్మినల్ నిర్మించారు. బ్రాజవిల్లే టెర్మినల్ నుంచి కాంతి కిరణం ద్వారా ఇంటర్నెట్ను కిన్షాసా టవర్ వైపు పంపించారు. కిన్షాసా టవర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసీవర్ ఈ కాంతి కిరణాన్ని గ్రహించి ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ను అందించింది. ఇప్పుడు కిన్షాసాలో 20జీబీపీఎస్ వేగంతో నెట్ వస్తున్నది.
వాతావరణం మారితే ఇబ్బందే
వాతావరణంలో కాంతి పుంజం ద్వారా ఇంటర్నెట్ సరఫరా చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వర్షం, మంచు లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కాంతి వేగం నెమ్మదించే అవకాశం ఉంది. అప్పుడు ఇంటర్నెట్ నెమ్మదించవచ్చు. అయితే కాంగోలో వాతావరణ పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయని, ఇంటర్నెట్ సరఫరాలో ఇబ్బంది ఉండదని ప్రాజెక్టు డైరెక్టర్ బారిస్ ఎర్క్మెన్ అన్నారు.
ఇండియాలోనూ ప్రయోగాలు
ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా సంప్రదాయ ఫైబర్ కేబుల్ విధానం లాంటిదే. ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో ఇంటర్నెట్ లైట్ రూపంలో కేబుల్ లోపలి నుంచి వెళ్తుంది. ఈ విధానంలో గాలిలో కాంతి రూపంలో వెళ్తుంది. దీని కోసం కాంతిని అతి సన్నని కాంతి పుంజంగా మార్చారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రయోగాలను తొలుత ఇండియాలో ప్రయత్నించారు. కానీ కాంతిని పంపే టెర్మినల్స్కు కోతుల వల్ల ముప్పు ఉండటంతో మానుకొన్నారు.