హుజారాబాద్ ప్రజాప్రతినిధుల ఆగ్రహం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం
మంత్రి గంగుల కమలాకర్తో కరీంనగర్లో భేటీ
కరీంనగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఈటల రాజేందర్ వెంట ఉండే ప్రసక్తే లేదని, అలాచేస్తే ప్రజలతో చివాట్లు తప్పవని హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు స్పష్టంచేశారు. కమలాపూర్ ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎర్ర ఇంద్రాసేనారెడ్డి ఆధ్వర్యంలో గోపాల్పూర్ సర్పంచ్ ఆడె గోపాల్, జమ్మికుంట ప్యాక్స్ చైర్మన్ పొనగంటి సంపత్, జమ్మికుంట రైతు సమన్వయసమితి ఆధ్వర్యంలో శనిగరం, మర్రిపల్లిగూడెం, మాదన్నపేట్, అంబాల, గోపాల్పూర్ గ్రామాలకు చెందిన 100 మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, నాయకులు, హుజూరాబాద్ ప్యాక్స్ చైర్మన్ ఎడవల్లి కొండల్రెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్, చెల్పూర్, జూపాకకు చెందిన వందమంది ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం మంత్రి కమలాకర్తో కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు వ్యక్తికన్నా పార్టీయే ముఖ్యమని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం తప్ప ఈటల వెంట ఉండే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. కేసీఆరే తమకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని, అలాంటప్పుడు పార్టీని వదిలి వెళ్తే కన్నతల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టే అవుతుందని అన్నారు. ఆ తరహా వ్యవహారం కొందరికే సాధ్యమవుతుందని విమర్శించారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా టీఆర్ఎస్లోనే కొనసాగుతామని చెప్పారు. ప్రజల సంక్షేమమే ఎజెండాగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలుచేస్తే.. ఈటల మాత్రం తన స్వప్రయోజనాలకు పెద్దపీట వేసుకోవడమే కాకుండా.. హుజూరాబాద్లో విభజించి పాలించారని, ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగకుండా కుట్రలు చేశారని మండిపడ్డారు. సమావేశంలో టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొనగంటి మల్లయ్య, పేర్యాల రవీందర్రావు పాల్గొన్నారు.
అత్మగౌరవం పేరుతో కొత్త నాటకం
మంత్రి గంగుల కమలాకర్
తన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో ఈటల రాజేందర్ అత్మగౌరవం పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈటల మాటలను, ఆటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని గంగుల స్పష్టంచేశారు. తనను కలిసేందుకు వచ్చిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి గంగుల మాట్లాడారు. ఈటల వ్యవహారం బట్టబయలు కావడంతో ఆత్మపరిశీలన చేసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గ సాధారణ కార్యకర్త నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టంచేశారని చెప్పారు. పార్టీకోసం పనిచేసేందుకు ముందుకొస్తున్నారని, ఇందులో భాగంగానే తనను కలుస్తున్నారని పేర్కొన్నారు. ఇది జీర్ణించుకోలేని రాజేందర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నానని, తనపై కేసులు సైతం నమోదయ్యాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొనలేదని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈటల మరో అబద్ధానికి తెరలేపే ప్రయత్నంచేస్తున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తను అవమానపరిచినా చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు.