జెనీవా, మే 12: ‘కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని నివారించి ఉండవచ్చు. కానీ ఊగిసలాట, పేలవమైన సమన్వయం… ఉపద్రవం ముంచుకొస్తున్నదన్న హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకుండా చేశాయి… మహావిపత్తుకు దారితీశాయి’ అని అంతర్జాతీయ స్వతంత్ర సంఘం తన నివేదికలో ప్రపంచ దేశాల తీరును ఎండగట్టింది. వరుసగా అనేక చెడు నిర్ణయాలు… ఇప్పటి వరకు 33 లక్షల మంది ప్రజల ప్రాణాలు తీశాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాయని విమర్శించింది. ప్రజలను కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సైన్స్ను తిరస్కరించే నాయకులు వైద్యారోగ్యపరమైన చర్యలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టారని తప్పుపట్టింది. మొట్టమొదట డిసెంబర్ 2019లో చైనాలోని వూహాన్లో కరోనా వైరస్ ప్రబలినప్పుడు దేశాలు సత్వరం స్పందించలేదని, దాంతో విలువైనటువంటి గత ఏడాది ఫిబ్రవరి నెల చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనాను మహమ్మారిగా మార్చిలో డబ్ల్యూహెచ్వో ప్రకటించిన తర్వాత కానీ దేశాలు చర్యలు మొదలుపెట్టలేదని తేల్చింది. పరిస్థితి చేయి దాటిపోయే వరకు కరోనా ఎలా వ్యాపిస్తున్నదో దేశాలు చూస్తు కూర్చున్నాయే తప్ప కట్టడికి చర్యలు చేపట్టలేదని చీవాట్లు పెట్టింది.
ఈ నివేదికను రూపొందించిన ‘ది ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్’ (ఐపీపీపీఆర్) అనే సంఘానికి న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, లైబీరియా మాజీ అధ్యక్షుడు, 2011 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సంఘాన్ని నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సభ్య దేశాలు గత ఏడాది మేలో కోరాయి. ఈ మేరకు ‘కొవిడ్-19: ఇదే చివరి మహమ్మారి కావాలి’ పేరిట నివేదికను సమర్పించింది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తును నివారించడానికి అంతర్జాతీయ హెచ్చరిక వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించింది. కరోనా హెచ్చరిక సంకేతాలను ఎవరూ పట్టించుకోకుండా గాలికొదిలేసిన అనుభవంతో ఈ నిర్ణయమెంతో ముఖ్యమని తెలిపింది.
మహమ్మారి ముప్పును దేశాలు లెక్కచేయలేదని, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కాలేదని నివేదిక పేర్కొంది. పేలవమైన వ్యూహాల ఎంపిక, అసమానతలపై పోరాటానికి విముఖత, సమన్వయం లేని వ్యవస్థ కలిసి విషతుల్యమైన మిశ్రమాన్ని తయారుచేశాయని, దీంతో మహమ్మారి… మహా మానవ సంక్షోభంగా మారిందని వ్యాఖ్యానించింది. ‘మనం ప్రస్తుతమున్న పరిస్థితి రాకుండా నివారించాల్సింది. అనేక వైఫల్యాలు, లోపాలు, సంసిద్ధం కావడం, స్పందించడంలో జాప్యం ఈ పరిస్థితికి కారణమయ్యాయ’ని సర్లీఫ్ విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్వోను కూడా ఈ నివేదిక ఉపేక్షించలేదు. అత్యంత తీవ్రస్థాయి ప్రమాద హెచ్చరికగా పరిగణించే ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్నర్న్ (పీహెచ్ఈఐసీ)’ను గత ఏడాది జనవరి 22వ తేదీనే డబ్ల్యూహెచ్వో జారీ చేసి ఉండాల్సిందని పేర్కొంది. కానీ ఆ పని చేయడానికి మరో 8 రోజులు వేచి చూసిందని తప్పుపట్టింది. మరోవైపు, కరోనాను మహమ్మారిగా మార్చిలో డబ్ల్యూహెచ్వో ప్రకటించే వరకు దేశాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గుర్తుచేసింది. మహమ్మారి విషయంలో చైనాలోనే ఆలస్యమైందనుకుంటే తర్వాత ప్రతిచోటా జాప్యాలు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించింది.
మహమ్మారులకు అడ్డుకట్ట వేయాలంటే డబ్ల్యూహెచ్వోకు మరిన్ని అధికారాలు ఉండాలని, ఆ సంస్థ ఏ దేశానికైనా వెళ్లి దర్యాప్తు చేయగలగాలని ఐపీపీపీఆర్ నివేదిక సూచించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి 92 అత్యంత పేద దేశాలకు సెప్టెంబరు 1వ తేదీకల్లా 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు, వచ్చే ఏడాది జూన్కల్లా మరో 100 కోట్ల డోసులు ఇవ్వాలని తెలిపింది. వ్యాక్సిన్లకు అవసరమైన 1900 కోట్ల డాలర్లలో 60 శాతాన్ని జీ7 దేశాలు భరించాలని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ టెక్నాలజీని, లైసెన్సులను ఇతర దేశాలకు ఇచ్చేలా వాటి తయారీదారులను డబ్ల్యూహెచ్వో, డబ్ల్యూటీవో ఒప్పించాలని సూచించింది.
కరోనా బీ.1.617ను ‘ఇండియన్ వేరియంట్’గా పిలువడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్వో తన నివేదికలో ‘ఇండియన్ వేరియంట్’ అనే పదాన్ని ఉపయోగించలేదని తెలిపింది. మరోవైపు, డబ్ల్యూహెచ్వో కూడా ఇదే సూచనలు చేసింది. కరోనా వేరియంట్లను దేశాల పేర్లతో కాకుండా వాటి శాస్త్రీయ నామాలతోనే పిలవాలని స్పష్టం చేసింది.