జకార్తా: ఇండోనేషియాలో కరోనా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 1,747 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష మార్కును దాటింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,00,636కు చేరింది. ఆసియా దేశాల్లో భారత్ తర్వాత ఈ సంఖ్యను చేరిన రెండో దేశం ఇండోనేషియా మాత్రమే. కరోనా డెల్టా వేరియంట్ ఆ దేశాన్ని వణికిస్తున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. దీంతో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది.
ఈ ఏడాది మే చివరి నాటికి ఇండోనేషియాలో కరోనా మరణాల సంఖ్య 50 వేలు దాటింది. దీనికి 14 నెలల సమయం పట్టింది. అయితే అనంతరం రెండు నెలల్లోనే కరోనా మరణాలు రెట్టింపయ్యాయి. దీంతో మంగళవారం నాటికి ఇండోనేషియాలో కరోనా మరణాల సంఖ్య లక్ష మార్కు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు లక్ష దాటిన బ్రెజిల్, భారత్ తర్వాత మూడో దేశంగా ఇండోనేషియా నిలిచింది. మరోవైపు అధికారులు పేర్కొన్న ఈ సంఖ్య కంటే మరణాలు మరింత ఎక్కువగానే ఉంటాయని ఆ దేశానికి చెందిన పలువురు అంచనా వేస్తున్నారు.