జకార్తా: రోజువారీ కరోనా కేసుల్లో భారత్ను ఇండోనేషియా అధిగమించింది. ఆసియాలో కరోనా హాట్ స్పాట్ దేశంగా మారింది. ఇండోనేషియాను డెల్టా వేరియంట్ వణికిస్తున్నది. ఆ దేశంలో నిత్యం 40 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్కు బాగా డిమాండ్ ఏర్పడటంతో ఇండోనేషియా ప్రభుత్వం వేలాది ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లు, వేలాది టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను అమెరికా, చైనా, జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నది. మరోవైపు ఇంట్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల కోసం వారి బంధువులు ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లతో ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలో రోజువారీ ఆక్సిజన్ వినియోగం 1,928 టన్నులకు పెరిగింది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ఆ దేశంలో లాక్డౌన్ను ఈ నెల 7న మరోసారి పొడిగించారు.