ఆపన్నులకు ఆర్థిక చేయూతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016
దివ్యాంగులకు రూ.3,016 అందజేత
నల్లగొండ జిల్లాలో 1,77,995 మంది లబ్ధిదారులు
తల్లీకొడుకుకు పింఛనే ఆధారం
పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన కాశిమళ్ల రామచంద్రమ్మ నిరుపేద. ఆమె కుమారుడు ఆనంద్ పుట్టుకతోనే దివ్యాంగుడు. కొడుకు పుట్టిన కొన్నాళ్లకే భర్త చనిపోవడంతో కూలి పనులు చేసి బతికేది. వయస్సు మీద పడడంతో మూడు సంవత్సరాల నుంచి ఆమె ఇంటి వద్దే ఉంటున్నది. కొడుకుకు వచ్చే రూ.3,016, తనకు వచ్చే రూ.2,016 వృద్ధాప్య పింఛన్తోనే బతుకు వెళ్లదీస్తున్నది. ఏ పనీ చేయలేని మాకు ఈ పింఛనే ఆసరా అయ్యిందని, సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడని కొనియాడుతున్నది.
ఒంట్లో సత్తువ లేక పనులు చేయలేని వృద్ధులు.. కాళ్లు, చేతులు వంకర్లు పోయి ఇంటికే పరిమితమైన దివ్యాంగులు.. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన వితంతువులతో పాటు ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు ఆర్థిక భరోసా ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతినెలా ఠంచన్గా పింఛన్ అందిస్తూ ఆయా కుటుంబాలకు అండగా నిలుస్తున్నది.
సీఎం కేసీఆర్ రూ.200 ఉన్న పింఛన్ను రూ.2016, రూ.500 ఉన్న పింఛన్ను రూ.3016కు పెంచి ఇంటి పెద్దగా ఆదుకుంటున్నాడు. ప్రతి లబ్ధిదారుడికీ ఈ పథకం ఎంతో ఆసరా అవుతుండడంతో ఆయా కుటుంబాల్లో సంతోషాలు విరబూస్తున్నాయి.
ఆపన్నులకు ఆర్థిక చేయూతనివ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రతినెలా ఆసరా పింఛన్లు అందిస్తున్నది. ఈ పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులతోపాటు ఒంటరి మహిళలు లబ్ధి పొందుతున్నారు. నల్లగొండ జిల్లాలో 1,77,995 మందికి పింఛన్ అందుతుండగా నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 29, 212మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పింఛన్దారులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.6.32 కోట్లు పంపిణీ చేస్తున్నది.
రూ.200 నుంచి రూ.2016రే పెరిగిన పింఛన్…
2014జూన్కు ముందు అప్పటి ప్రభుత్వం దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.200 పింఛన్ ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పింఛన్ రూ.1500, వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు రూ.1000కి పెంచింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు రూ.3016, ఇతరులకు రూ.2016అందిస్తున్నారు. గతంలో లేని విధంగా ఒంటరి మహిళలకు కూడా ప్రతినెలా రూ.2016పంపిణీ చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 7263మంది ఒంటరి మహిళల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే 1208మంది ఉన్నారు. ఆసరా పింఛన్లు అత్యధికంగా నిడమనూరు మండలంలో 5,259మందికి అందుతున్నాయి.
వృద్ధులకు మరింత గౌరవం…
కొడుకులు పట్టించుకోకపోవడం, దూరప్రాంతాల్లో ఉండడం వల్ల వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులు చాలా కష్టాలు పడుతుంటారు. వీరికి ప్రభుత్వం ఇస్తున్న ఫించన్ ఎంతో భరోసా కల్పిస్తున్నది. వారి కొడుకులు, కూతుళ్ల నుంచి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నది. కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులకు వచ్చే పింఛన్ కోసమే దగ్గరకు తీసే పరిస్థితులు ఉన్నాయంటే ఆసరా ఎంత చేయూతనిస్తుందో స్పష్టమవుతున్నది.
నెలకు రూ.6.32కోట్లు…
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పింఛన్దారులకు ప్రభుత్వం నెలకు రూ.6.32కోట్లు వెచ్చిస్తున్నది. మొత్తం 29,212మంది లబ్ధిదారుల్లో నిడమనూరులో 5,259 మంది, హాలియా మున్సిపాలిటీలో 1621, అనుముల మండలంలో 2,886, గుర్రంపోడులో 5156, పెద్దవూరలో 4681, త్రిపురారంలో 4402, తిరుమలగిరి సాగర్లో 4276, నందికొండలో 918మంది ఉన్నారు. త్వరలో మరో 1211మందికి పింఛన్లు అందనున్నాయి.
ఫించన్ డబ్బులే ఆధారం..
నిడమనూరు, మార్చి 28 : మండలంలోని వేంపాడు గ్రామానికి చెందిన వెంపటి రమణమ్మ పుట్టుకతో దివ్యాంగురాలు. ఐదేండ్ల కింద ఆటోలో వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. రెండేండ్ల పాటు మంచానికే పరిమితమైంది. పూట గడవడం కష్టమవడంతో మానసికంగా కుదేలయ్యింది… ఒక్క కొడుకును పోషించుకునే దారి లేక మనోవేదనకు గురైంది. ఇంతలో సీఎం కేసీఆర్ దివ్యాంగుల ఫించన్ రూ.3016కు పెంచడంతో ఆమె కష్టాలు తీరాయి. నెలా నెలా ప్రభుత్వం ఇస్తున్న ఫించన్ డబ్బులకు తోడు రేషన్ దుకాణం ద్వారా ఇస్తున్న బియ్యం వారి జీవనానికి అడ్డంకులను శాశ్వతంగా దూరం చేయడంతో జీవితం పట్ల భరోసా కలిగింది.
కేసీఆర్ సారే పెద్ద దిక్కు..
నా పేరు బోడ చంద్రమ్మ. కేసీఆర్ గవర్నమెంటు వచ్చిన తర్వాతనే వృద్ధులకు 2వేల రూపాయల పింఛన్ ఇస్తున్నడు. ఇప్పుడు నాకు పింఛన్ ఆదెరువైంది. కూలి పని చేసుకోవడానికి నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. పింఛన్ డబ్బులతోనే బతుకుతున్నాం. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ డబ్బులే ఆసరా అయితున్నయి.
మా పాలిట దేవుడు…
పళ్లైన 15సంవత్సరాలకు నా భర్త చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు కూడా పదేండ్ల కిందట యాక్సిడెంట్లో చనిపోయిండు. నా ఆరోగ్యం బాగా లేదు. ఇండ్లల్లో పాచి పని చేసి జీవనం సాగిస్తున్నా. అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ వితంతువులకు రూ.2016పింఛన్, రేషన్ బియ్యం ఇస్తుండడంతో జీవనం సాగుతున్నది. నాలాంటి ఎంతోమందికి దారి చూపిన ముఖ్యమంత్రి సల్లగుండాలి.
నాకు పింఛన్ డబ్బులే ఆధారం..
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు అందిస్తున్న ఆసరా పింఛన్ డబ్బులు చాలా ఉపయోగపడుతున్నయి. నా భర్త చనిపోయి 15సంవత్సరాలు కావొస్తున్నది. అప్పటి నుంచి నా కుటుంబ సభ్యులపైనే ఆధారపడి బతుకుతున్నా. నాకు ఏదైనా అవసరం వచ్చి డబ్బులు అడుగడానికి చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పడు సీఎం కేసీఆర్ సార్ ప్రతి నెలా ఆసరా పింఛన్ ఇస్తున్నందున నేను చాలా గర్వంగా బతుకుతున్నాను.
-బత్తుల లక్ష్మమ్మ, పైలాన్ కాలనీ, నందికొండ
సీఎం సారు సల్లగుండాలి..
కేసీఆర్ సారు వచ్చినంక మా బోటి ముసలోళ్లకు మంచి రోజులొచ్చినయి. ఉద్యోగులకు జీతం ఇచ్చినట్లు నెలకు 2016రూపాయలు ఇస్తున్నడు. గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకు 200రూపాయలు ఇస్తే దేనికీ సరిపోయేది కాదు. పేరుకు రెండు వందల రూపాయలు ఇచ్చిండన్న పేరే కానీ పెద్దగా ఉపయోగపడేవి కావి. ముఖ్యమంత్రి ఇస్తున్న 2016రూపాయలను చూసే చాలా మంది కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు దగ్గరకు వస్తున్నరు.
పింఛన్ మా కుటుంబాన్ని నిలబెట్టింది…
దివ్యాంగుల పింఛన్ నా కుటుంబాన్ని నిలబెట్టింది. ఏ ఆధారం లేని దివ్యాంగురాలినైన నేను ఎట్ల బతకాల్నో అని భయపడిన. సీఎం కేసీఆర్ సారు ఇచ్చిన పింఛన్ డబ్బులతోని నేను, నా కొడుకు జీవనం సాగిస్తున్నం. నా లాంటి పేద దివ్యాంగులకు అండగా నిలబడ్డ సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం. పేదల బతుకుల్లో వెలుగులు నింపిన కేసీఆర్ సారుకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం.