సంగారెడ్డి : ఆంధ్రా తొత్తులకు, అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదు అని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ గురించి మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి గొంతు నొక్కి అసెంబ్లీ నుంచి పంపించాడు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణను అవమానించిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన వారసులమని కొందరు వస్తున్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.
సంగారెడ్డి జిల్లా పరిధిలోని సదాశివపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విశ్వాసంతోనే ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్లలో చేయలేని పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలో చేసి చూపించిందన్నారు. దేశంలో ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్ ఉన్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. గత పాలకులు సంగారెడ్డికి చేసిందేమీ లేదన్నారు. సదాశివపేటకు కూడా త్వరలోనే గోదావరి నీళ్లు తీసుకోస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిమ్జ్ ప్రారంభమైతే ఈ ప్రాంత యువతకు వేలాది సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
సదాశివపేట ఎంపీపీ యాదమ్మ, సర్పంచులు లక్ష్మారెడ్డి(వెళ్తూర్), శ్రీనివాస్(పెద్దపూర్), లక్ష్మీ శేఖర్(నాగ్ సాన్ పల్లి), రాజు(నదికంది), విజయలక్ష్మి(అంకెనపల్లి), శోభారాణి(కొనాపూర్), భిక్షపతి (మాజీ సర్పంచ్), నర్సింహ గౌడ్(మాజీ సర్పంచ్ వెళ్తూర్), కాలీమ్ మోహియుద్దీన్(కాంగ్రెస్ మైనార్టీ పార్టీ కార్యదర్శి), పులిరాజు గౌడ్(కౌన్సిలర్ సదాశివపేట 8వ వార్డ్)తో పాటు పలువురు ఉన్నారు.