దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఘనీ.. హత్యలో తమ ప్రమేయం లేదన్న తాలిబన్లు
కాబూల్, జూలై 16: ఆఫ్ఘనిస్థాన్లో భద్రతా బలగాలు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని కాందహార్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాందహార్లోని స్పిన్ బొల్డాక్ ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమిస్తుండటంతో ఆఫ్ఘన్ భద్రతా బలగాలు వారిని నిలువరించాయి. ఈ ఘర్షణలను కవర్ చేస్తుండగా డానిష్ హత్యకు గురయ్యారు. ముంబయికి చెందిన డానిష్.. 2010 నుంచి రాయిటర్స్ సంస్థలో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. డానిష్ మృతిని భారత్లోని ఆఫ్ఘన్ రాయబారి పారిద్ మముంజే ధ్రువీకరించారు. డానిష్ మరణంపై ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రిడెన్బర్గ్, డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ విచారం వ్యక్తం చేశారు. డానిష్ మృతికి తాము కారకులం కాదని తాలిబన్లు ప్రకటించారు. జర్నలిస్టులు ‘వార్ జోన్’లోకి వచ్చే ముందు తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డానిష్ మృతదేహాన్ని రెడ్క్రాస్ సంస్థకు అప్పగించారు.