వాషింగ్టన్: భారత సంతతికి చెందిన 48 ఏళ్ల టెక్ ఎగ్జిక్యూటివ్ ముకుంద్ మోహన్ ( Mukund Mohan ) కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అక్రమరీతిలో సుమారు రూ.13.32 కోట్లు (1.8 మిలియన్ డాలర్లు) కోవిడ్ రుణం ( Covid Loan )తీసుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. కోవిడ్-19 డిజాస్టర్ రిలీఫ్ లోన్ కోసం ముకుంద్ తప్పుడు పత్రాలను సమర్పించాడు. వాషింగ్టన్లోని క్లైడ్హిల్కు చెందిన అతనికి అమెరికా కోర్టు శిక్షను ఖరారు చేసింది. మనీలాండరింగ్, మోసం కేసులను అతనిపై బుక్ చేశారు.
మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి సంస్థల్లో గతంలో పనిచేసిన మోహన్.. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణ పథకాన్ని పొందేందుకు తప్పుడు ద్రువీకరణ పత్రాలను సమర్పించాడు. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ లోన్ కోసం అతను దరఖాస్తు చేసుకున్నాడు. సుమారు 5.5 మిలియన్ల డాలర్ల రుణం కోసం మోహన్ దరఖాస్తులు పెట్టుకున్నాడు. నకిలీ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న అతనికి 1.8 మిలియన్ల డాలర్ల రుణం ఇచ్చారు. అయితే గత ఏడాది జూలైలో మోహన్ను అదుపులోకి తీసుకున్నారు.
వాషింగ్టన్లోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు మంగళవారం రోజున ఆ కేసులో మోహన్కు రెండేళ్ల శిక్ష వేసింది. 8 రకాల నకిలీ దరఖాస్తులతో మోహన్ లోన్ తీసుకున్నట్లు కోర్టు చెప్పింది. రుణం కోసం పన్ను కట్టినట్లు తప్పుడు పత్రాలను చూపించాడు. మహెంజా కంపెనీలో డజన్ల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారని, వారందరికీ మిలియన్ల డాలర్ల రూపంలో జీతాలు చెల్లించినట్లు అతను పేర్కొన్నాడు. అయితే అవన్నీ అబద్దాలను కోర్టు తేల్చింది.