కరోనా బాధితులతో కామారెడ్డి కలెక్టర్ శరత్
బాన్సువాడ దవాఖాన సందర్శన
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని వెల్లడి
బాన్సువాడ, మే 22 : అధైర్య పడొద్దని, ధైర్యంగా ఉండాలని కొవిడ్ బాధితులకు కామారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. కరోనాకు ధైర్యమే మందు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, మంత్రి ప్రశాంత్రెడ్డి సమీక్షలు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచనలతో జిల్లాలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. బాన్సువాడ పట్టణంలో శనివారం ఆయన ఆకస్మికంగా పర్యటించి లాక్డౌన్ అమలును పర్యవేక్షించారు. రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను నిలిపి ఎందుకు బయటికి వచ్చారని ప్రశ్నించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానను సందర్శించి కొవిడ్బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేయడంతోపాటు కరోనా బారినపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో వందకు 20 నుంచి 30 పాజిటివ్ కేసులు వచ్చేవని, ప్రస్తుతం 6 నుంచి 8 నమోదవుతున్నాయన్నారు. గతంలో 90 బెడ్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 723కు చేరిందన్నారు. బాన్సువాడ దవాఖానలో వంద ఆక్సిజన్ బెడ్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఎక్కడ అవసరం ఉన్నా అందించేలా ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడుత జ్వర సర్వేలో 2 లక్షల 58 వేల 950 కుటుంబాల వివరాలు సేకరిం చిన సర్వే బృందాలు, 6561 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించాయన్నారు. అందరూ రికవరీ అయ్యారని, కేవలం ఏడు గురికి మాత్రమే లక్షణాలు ఉన్నాయని, వారికి చికిత్స అందిస్తు న్నామన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు చెక్పోస్టుల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టామని, సరిహద్దు గ్రామాల్లో ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదన్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ప్రసాద్, తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రమేశ్ తదితరులు ఉన్నారు.
31 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ అంచనా 4 లక్షల 50వేల మెట్రిక్ టన్నులు కాగా, 4 లక్షల 12 వేల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. శుక్రవారం నాటికి 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయ్యిందన్నా రు. ఎమ్మెల్యేలతోపాటు తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు కలిసి రైస్మిల్లర్లు, ట్రాన్స్పోర్టు వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ధాన్యం సేకరణకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. మరో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు.
కొవిడ్ కేసులు తగ్గుముఖం..
సెకండ్వేవ్ మొదలయ్యాక కామారెడ్డి జిల్లాలో గతంలో సగటున 100 మందికి టెస్టులు నిర్వహిస్తే 20 నుంచి 30 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యేది. ప్రస్తుతం వందకు 6 నుంచి 8 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు.
-డాక్టర్ శరత్, కలెక్టర్, కామారెడ్డి