రావల్పిండి: ఇండియా కరోనా కోరల్లో చిక్కుకున్న ఈ సమయంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇచ్చిన ఓ వీడియో సందేశం ఇండోపాక్ అభిమానులను ఫిదా చేసింది. వైరస్పై పోరాటంలో భాగంగా ఇండియాకు సహాయం చేద్దామంటూ అతడు ఆ వీడియోలో పిలుపునిచ్చాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమని అక్తర్ అన్నాడు. ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారతదేశానికి ఆక్సిజన్ ఇవ్వండంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అతడు కోరాడు.
మా ప్రభుత్వం, అభిమానులను ఇండియాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇండియాకు చాలా ఆక్సిజన్ ట్యాంకులు కావాలి. ప్రతి ఒక్కరూ ఇండియా కోసం విరాళాలు సేకరించి, వాళ్లకు అవసరమైన ఆక్సిజన్ ట్యాంకులను అందించాలని కోరుతున్నాను అని తన యూట్యూబ్ చానెల్ వీడియోలో అక్తర్ కోరాడు. ఇంతకుముందు కూడా ఇండియాలో కరోనా తీవ్రతను గమనించిన అక్తర్.. సాయం చేయాల్సిందిగా ప్రపంచ దేశాలను కోరాడు.