నాగార్జునసాగర్ వెనుకబాటుకు ఆయనే కారణం
టీఆర్ఎస్తోనే నియోజకవర్గ అభివృద్ధి
సంక్షేమపథకాల అమలులో మనమే నంబర్వన్
సబ్బండవర్ణాల సహకారంతో భగత్ విజయం ఖాయం
హాలియాలో మీడియాతో మంత్రి తలసాని
హాలియా, ఏప్రిల్1: నాగార్జునసాగర్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నీతులు మాట్లాడుతున్నారని.. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలు నిలదీస్తారనే ప్రచా రం చేయకుండా ఉందామంటూ కొత్తరాగం ఎత్తుకున్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. ప్రచారంచేస్తే ఇతరపార్టీలపై విమర్శలు చేయాల్సి వస్తదని నీతులు వల్లిస్తున్న జానారెడ్డి.. హాలియా సభలో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ను ఏకవచనంతో విమర్శిస్తే ఎందుకు నివారించలేదని నిలదీశారు. 35 ఏండ్లు ఎమ్మెల్యేగా, 17 ఏండ్లు మంత్రిగా ఉండి ఇక్కడి ప్రజలకు ఏమీ చేయలేకపోయారని ఎద్దేవాచేశారు. సాగర్ నియోజకవర్గ వెనుకబాటుతనానికి జానారెడ్డే కారణమని పేర్కొన్నారు. గురువారం హాలియాలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. సాగర్ ఉప ఎన్నికల్లో సబ్బండవర్ణాల సహకారంతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అత్యధిక మెజార్టీతో గెలువడం ఖాయమని తెలిపారు. ఎక్కడికెళ్లినా భగత్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్ పాలనే కారణమని పేర్కొన్నారు. యాదవ, కురుమ, నాయీబ్రాహ్మణ, నేత, గీతన్నలకు తగినవిధంగా సహకారమందిస్తూ ప్రభుత్వం కుల వృత్తిదారులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, కొనేరు కోనప్ప, జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీచైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి నాయకులు పాల్గొన్నారు.
ముస్లిం మైనార్టీలతో హోంమంత్రి సమావేశం
నందికొండ: నాగార్జునసాగర్లో చిన్నలీడర్ స్థాయి అభివృద్ధి కూడా మాజీమంత్రి జానారెడ్డి చేయలేదని హోంమంత్రి మహమూద్ అలీ విమర్శించారు. నందికొండ హిల్కాలనీలో గురువారం ముస్లింమైనార్టీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో అనేక పదవులు అనుభవించిన జానారెడ్డి నియోజకవర్గంలో సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని తెలిపారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య రెండేండ్లలోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. నందికొండను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి బాటపట్టించారని పేర్కొన్నారు. ముస్లింల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు ముస్లింలంతా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణరావు, నందికొండ మున్సిపాలిటీ వైస్చైర్మన్ మంద రఘువీర్, మైనార్టీ నాయకులు అబ్బాస్, బషీర్, సుభానీ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్: జగదీశ్రెడ్డి
పెద్దవూర: సాగర్ పక్కనే ఉన్నా కృష్ణపట్టెకు, ఎడమ కాలువ చివరి భూములకు నీరవ్వలేని అసమర్థులు నాటి కాంగ్రెస్ నాయకులని.. వారికి పదవుల మీద యావతప్ప.. ప్రజల మీద ప్రేమ లేదని విద్యుత్తుశాఖమంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే 60 వేల ఎకరాలకు నీళ్లందించి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. పెద్దవూరలోని రాఘవేంద్ర ఫంక్షన్హాల్లో గురువారం 56 గ్రామాల ఇన్చార్జిలు, 50 మంది కోఆర్డినేటర్లు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సాగర్లో ఇప్పటిదాకా జానారెడ్డి చేసిందేమీ లేదని.. భవిష్యత్లో చేసేదేమీ లేదని ఎద్దేవాచేశారు. ప్రజలు ఆయనకు రాజకీయాల నుంచి విరమణ ఇచ్చేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పా రు. టీఆర్ఎస్ అభ్యర్థి భగత్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్: పల్లా
త్రిపురారం: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. త్రిపురారం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తునందిస్తూ.. పండించిన ప్రతి గింజనూ రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ.. గ్రామ గ్రామాన 20 నుంచి 30 మంది యువకులకు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునిచ్చిందని చెప్పారు. ఇన్నిచేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
భగత్కు జననీరాజనం
త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం, నీలాయిగూడెం, అంజనపల్లి, రాగడప, కాపువారిగూడెం, లచ్యాతండా, పలుగుతండా, మీట్యాతండా, రాగడప, మాటూరు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు జనం అడుగడుగునా నీరాజనం పలికారు. సత్యనారాయణపురం, అంజనపల్లి గ్రామాల్లో యువతులు, మహిళలు బోనాలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో భగత్ గెలుపును కాంక్షిస్తూ మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేకపూజలు చేశారు. ఆయా గ్రామాల్లో డప్పు కళాకారుల నృత్యాలు, మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకున్నది. భగత్ ప్రచార రథంపై యువకులు, పార్టీ కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. ప్రచార కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు తేరా చిన్నపరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు బాణోతు శంకర్నాయక్, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బాలరాజుయాదవ్ పాల్గొన్నారు.