ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
సాఫీగా పదర మండల సర్వసభ్య సమావేశం
అమ్రాబాద్, ఏప్రిల్ 1: నల్లమల ప్రాంతమైన అమ్రాబాద్, పదర మండలాలను అన్నివిధాలుగా అభివృద్ధిపరుస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం పదర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బిక్యానాయక్ అధ్యక్షతన నిర్వహించిన మండల సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ ఉమ్మడి మండలాలకు శ్రీచెన్నకేశవ లిఫ్ట్ ద్వారా 1.4 టీఎంసీల నీటిని తీసుకొస్తున్నామన్నారు. దీనికి సర్వే మొదలైందన్నారు. వచ్చేనెలలో సీఎం కేసీఆర్తో భూమిపూజ ఉంటుందని ఈ ఫలాలను రెండేళ్లలో అందుకోబోతున్నామన్నారు. సర్వేకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. అంతకుముందు సభలో అన్నిశాఖల ప్రగతి వివరాలు విన్న ఆయన ప్రతి గ్రామంలో పల్లెప్రగతి పనులు నెలలో పూర్తిచేయాలని కోరారు. గ్రామాల్లో అధికారులతో ప్రజాప్రతినిధులు మమేకమై ప్రజల సహకారంతో పనులు పూర్తిచేయాలని కోరారు. అటవీ భూములు, పోడుభూములపై ప్రత్యేకశ్రద్ధ వహించానని తెలిపిన ఆయన త్వరలో పట్టాలు వచ్చే ప్రయత్నం సాగుతుందన్నారు. అటవీశాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని కోరారు. అనంతరం 11 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఆయనను పలువురు నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాంబాబు, వైస్ ఎంపీపీ వరుణ్, ఎంపీడీవో వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
హోలీ వేడుకల్లో పాల్గొన్న విప్
మండలంలోని బీకే లక్ష్మాపూర్ తండాలో గిరిజనులు నిర్వహించిన ప్రత్యేక హోలీ వేడుకల్లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనుల ఆరాధ్యదైవమైన ముత్యాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, జిల్లా నాయకుడు చెన్నకేశవులు, ఎంపీటీసీ జయరాం, నేతలు శ్రీనివాసులు, పాండు తదితరులు పాల్గొన్నారు.