కాబూల్ : కాబూల్ విమానాశ్రయంలో బాంబు పేలుళ్ల ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటాడి వారు తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తామని హెచ్చరించారు. బాంబు పేలుళ్ల ఘటన సమాచారం అందగానే బైడెన్ ఇజ్రాయల్ ప్రధానితో తన భేటీని రద్దు చేసుకున్నారు. ఉగ్ర దాడిని మర్చిపోమని, టెర్రరిస్టులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఆప్ఘనిస్ధాన్లో ఉన్న అమెరికన్లను కాపాడతామని, తమ మిత్రదేశాల ప్రజలను అక్కడి నుంచి తరలించే తమ మిషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
కాబూల్ ఎయిర్పోర్ట్కు దూరంగా ఉండాలని అమెరికా ఇప్పటికే తమ పౌరులను కోరింది. మరోవైపు కాబూల్లో బాంబుపేలుళ్లను భారత్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఒక్కటిగా పోరాడాల్సిన అవసరాన్ని ఈ దాడులు గుర్తు చేశాయని వ్యాఖ్యానించింది. ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది.