డొమినికా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ తర్వాత దేశం వదిలి పారిపోయిన వ్యాపారి మెహుల్ చోక్సీని తీసుకెళ్లడానికి ఇండియా ఓ ప్రైవేట్ జెట్ను పంపించినట్లు ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ ఆదివారం వెల్లడించారు. డొమినికాలోని డగ్లస్-చార్లస్ ఎయిర్పోర్ట్లో ఆ విమానం ల్యాండైనట్లు ఆయన చెప్పారు. చోక్సీని తిరిగి అప్పగించడానికి అవసరమైన డాక్యుమెంట్లు కూడా ఈ విమానంలో వచ్చినట్లు తెలిపారు. అయితే దీనిపై భారత అధికారుల నుంచి ఇప్పటి వరకూ స్పష్టమైన సమాధానం రాలేదు.
ఆదివారం ఉదయమే ఈ విమానం వచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఆ తర్వాత ఓ రేడియోతో మాట్లాడుతూ.. ఆంటిగ్వా ప్రధాని బ్రౌన్ కూడా దీనిని ధృవీకరించారు. అవును. ఓ జెట్ వచ్చింది. అక్కడి కోర్టుల్లో జరిగిన విచారణకు సంబంధించిన పత్రాలు కూడా అందులో వచ్చాయి. చోక్సీ ఓ పారిపోయి వచ్చిన వ్యక్తి అని ధృవీకరించేందుకు ఆ పత్రాలను ఇండియా పంపించి ఉండొచ్చు అని ఆయన అన్నారు. బుధవారం వరకూ చోక్సీని భారత్కు అప్పగించకుండా డొమినికాలోని కోర్టు జడ్జి స్టే విధించారు. దీంతో భారత ప్రభుత్వం ఈ పత్రాలను పంపించి, అతన్ని ఎలాగైనా తిరిగి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది అని ఆయన తెలిపారు.
డొమినికా నేరుగా అతన్ని ఇండియాకే అప్పగించాలని తాను అభ్యర్థిస్తున్నట్లు కూడా చెప్పారు. ఒకవేళ అతడు మళ్లీ ఆంటిగ్వాకు వస్తే ఇక్కడ అన్ని చట్టపరమైన, రాజ్యాంగ రక్షణలు అతనికి దక్కుతాయి అని బ్రౌన్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి ఈ నెల 28నే ఈ విమానం డొమినికాకు వెళ్లినట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ కూడా ఇప్పటికే వెల్లడించింది. 200 కోట్ల డాలర్ల కుంభకోణంలో అతడు ప్రధాన పాత్రధారి అని, అతన్ని కచ్చితంగా ఇండియాకు అప్పగించాలని డొమినికా అధికారులపై ఇండియా ఒత్తిడి తీసుకొస్తోంది.