పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగుల హర్షాతిరేకాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు
మహబూబ్నగర్, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శాసనసభలో సీఎం కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు వరాల జల్లు కురిపించారు. 30 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కరోనా, ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందన్నారు. కాగా, ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి.. మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. టీజీవోలు, టీఎన్జీవోలు, పీఆర్టీయూ (టీఎస్) తదితర ప్రధాన సంఘాలన్నీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు సంబురాల్లో మునిగితేలారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైందని కేసీఆర్ పేర్కొనడాన్ని అన్ని సంఘాలూ స్వాగతించాయి. మరింత ఉత్సాహంతో తమ విధులు నిర్వర్తిస్తామని ఉద్యోగులు తెలిపారు. సీఎం ప్రకటనతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 24 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు లబ్ధి పొందనున్నారు.
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించడంతోపాటు పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు 180 రోజులూ ప్రసూతీ సెలవులు ఇవ్వడం హర్షణీయం. ఉద్యోగులపై సీఎం కేసీఆర్ కు ఉన్న అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ పరిష్కారమైంది.