న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అందరికీ ఈ-వీసా( e-Visa )లు తప్పనిసరి అని బుధవారం కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మన దేశంలోని లేని ఆఫ్ఘన్ల వీసాలన్నింటినీ రద్దు చేసినట్లు కూడా ప్రకటించింది. ఆఫ్ఘన్ జాతీయుల పాస్పోర్ట్లు గల్లంతయ్యాయన్న వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియాకు రావాలనుకుంటున్న ఆఫ్ఘన్లు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక పోర్టల్ను కూడా సూచించింది.
www.indianvisaonline.gov.inలో ఆఫ్ఘన్ జాతీయులు తమ ఈ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇండియాకు రావాలని అనుకుంటున్న ఆఫ్ఘన్ జాతీయుల దరఖాస్తులను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నెల మొదట్లో భారత ప్రభుత్వం కొత్తగా ఈ-వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వీసా కేటగిరీలలో దేని కిందికీ రాని వీసాల కోసం కొత్తగా ఈ e-Emergency X-Misc Visa జారీ చేయనున్నట్లు హోంశాఖ చెప్పింది. నిర్ధిష్ట కాల పరిమితితో ఈ వీసాలను జారీ చేస్తున్నారు.