న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగశాఖ మంత్రి అంటోనీ బ్లింకెన్ మంగళవారం భారత్లో అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన భారత్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో అడుగు పెట్టగానే అంటోనీ బ్లింకెన్ స్పందిస్తూ.. ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో భారత్ తమకు ముఖ్య భాగస్వామి అన్నారు. ఆయన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు పలు అంశాలపైన, ఆఫ్ఘనిస్థాన్లో శాంతి స్థాపనపై చర్చిస్తారు.
ఇండో-పసిఫిక్ , ఇతర ప్రాంతీయ అంశాలు, పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అమెరికా విదేశాంగ మంత్రిగా అంటోనీ బ్లింకెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్లో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి.
అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ అంథోనీ బ్లింకెన్ రాకతో అమెరికా-భారత్ భాగస్వామ్యం బలోపేతం కావడంతోపాటు మరింత పెరుగుతుందని, విస్తరిస్తుందని ఆసక్తితో చూస్తున్నామని చెప్పారు. బ్లింకెన్ తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ తదితరులతో చర్చిస్తారు.