న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. దీంతో కాబూల్లో ఉన్న ఎంబసీలన్నీ ఖాళీ అవుతున్నాయి. అక్కడ ఉన్న భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందిని కూడా తరలిస్తున్నారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానంలో .. కాబూల్లోని ఇండియన్ ఎంబసీ సిబ్బందిని తీసుకువస్తున్నారు. సుమారు 120 మంది అధికారులు ఆ విమానంలో ఉన్నట్లు సమాచారం. కాబూల్ విమానాశ్రయానికి చాలా సురక్షితంగా భారతీయుల్ని తరలించినట్లు అధికారులు చెప్పారు. అంబాసిడర్తో పాటు సిబ్బంది తరలింపు ప్రక్రియ మొదలైనట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
ఆదివారం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ను చేజిక్కించుకున్నారు. దీంతో అక్కడ అంతా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. ఇక తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు విమానాశ్రయాలకు బారులు తీస్తున్నారు. విమానం టర్మాక్పై కూర్చున్న కొందరు టేకాఫ్ సమయంలో కిందపడిన దృశ్యాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘన్లో దీనస్థితి నెలకొన్నది.