కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో బాలికలకు సంఘీభావంగా బాలురు కూడా స్కూళ్లకు వెళ్లడం లేదు. వారు కూడా ఇంటి వద్దనే ఉంటున్నారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్, ఒకటి నుంచి 12వ తరగతి చదివే బాలురకు శనివారం నుంచి స్కూళ్లలో తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించింది. బాలురకు మగ ఉపాధ్యాయులే బోధించాలని తాలిబన్ విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బాలికల చదువు, మహిళా టీచర్ల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
ఈ నేపథ్యంలో బాలికలకు సంఘీభావంగా కొందరు బాలురు స్కూళ్లకు వెళ్లలేదు. బాలికల కోసం స్కూళ్లను తెరిచేంత వరకు తాము కూడా స్కూళ్లకు వెళ్లబోమని వారు చెప్పినట్లు ది వాల్స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ‘మహిళలు సమాజంలో సగం. బాలికల పాఠశాలలు కూడా తెరిచే వరకు నేను పాఠశాలకు వెళ్లను’ అని 12 వ తరగతి చదువుతున్న 18 ఏండ్ల విద్యార్థి రోహుల్లా అన్నట్లు పేర్కొంది.
కాగా, అమ్మాయిలు ఉదయం, అబ్బాయిలు మధ్యాహ్నం చదువుతారని, మగ టీచర్లు అబ్బాయిలకు, మహిళా టీచర్లు అమ్మాయిలకు బోధిస్తారని ఆఫ్ఘనిస్థాన్లోని ఒక టీచర్ చెప్పారు. ఒకవేళ బాలికలకు కూడా స్కూళ్లు తెరిచినప్పటికీ వెళ్లేందుకు కొందరు వెనుకాడవచ్చని కాబూల్లోని ప్రైవేట్ స్కూలుకు చెందిన ఒక ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు.
‘అబ్బాయిల విద్య ఒక కుటుంబాన్ని ప్రభావితం చేయవచ్చు. కానీ, బాలికల విద్య సమాజంపై ప్రభావం చూపుతుంది. బాలికల విద్య ఒక తరాన్ని రూపొందిస్తుంది’ అని స్కూల్ ప్రిన్సిపాల్ మొహమ్మద్రెజా అన్నారు. బాలికలు తమ విద్యను తిరిగి ప్రారంభించడానికి, వారి చదువును పూర్తి చేయడానికి తాము చేయాల్సిందా చేస్తామని ఆయన చెప్పారు.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్లో బాలికల విద్య, వారి భవిష్యత్ చదువుపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.