కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు మోదీ ర్యాలీ సందర్భంగా బీజేపీలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి కాషాయ పార్టీ హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ మంగళవారం రిలీజ్ చేసింది. 13 మంది అభ్యర్థులు ఉన్న ఈ జాబితానే చివరిదని భావిస్తున్నారు. అయితే ఇందులోనూ మిథున్ చక్రవర్తి పేరు లేదు. ఆయన కోసమే రిజర్వ్ చేసి ఉంచారనుకున్న రాస్బేహారీ స్థానం నుంచి రిటైర్డ్ లెఫ్ట్నెంట్ జనరల్ సుబ్రతా సాహాను బరిలోకి దింపారు. మిథున్ పార్టీలో చేరిన సౌత్ కోల్కతా స్థానాన్నే ఆయనకు కేటాయిస్తారని గతంలో బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నేను కోబ్రాను. ఒక్క కాటుతో మిమ్మల్ని ఫొటోగ్రాఫ్గా మార్చగలను అంటూ మోదీ మీటింగ్లోనే మిథున్ అన్నారు.
అంతేకాదు ఈ మధ్యే ముంబైలో ఉన్న తన ఓటును తీసేసి కోల్కతాలో నమోదు చేయించుకున్నారు. ఇప్పటికైతే అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన అయిపోయింది కాబట్టి ఇక మిథున్కు అవకాశం లేనట్లే. మరో అభ్యర్థిని మార్చి మిథున్ను నిలబెట్టే అవకాశాలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి. బెంగాల్లో 8 దశల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో చివరి దశకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ మధ్యలో ఉండనుంది. అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోయినా.. మార్చి 30 నుంచి మిథున్ నందిగ్రామ్లో సువేందు తరఫున ప్రచారం చేయనున్నారు.