పథకాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాం
ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా
కొలాంగూడ, పులికుంట గ్రామాల్లో పర్యటన
రెబ్బెన, మార్చి 26 : ఆదివాసుల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, వారికి సంబంధించిన పథకాలను పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా అన్నారు. రెబ్బెన మండలంలోని కొలాంగూడ, పులికుంట ఆదివాసీ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన పీవోకు ఆదివాసులు తమ సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. సమస్యలపై ప్రతి ఒక్కరినీ అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్నత చదువులు చదివిన వారి వివరాలు అందించాలని సూచించారు. ఎస్టీలు ఎడ్ల జతలు, ఎడ్లబండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. గిరి వికాసం కింద విద్యుత్ మోటర్లు, బోర్వెల్స్, విద్యుత్ సామగ్రి అందిస్తున్నట్లు తెలిపారు. పదోతరగతి పాసైన వారి కోసం హైదరాబాద్లో 4 కళాశాలలు ఉన్నాయని, రెండేళ్లపాటు ఉచితంగా విద్య అభ్యసించవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30 ఏండ్ల నుంచి కాస్తులో ఉన్నవారికి సర్వే చేసి పట్టాలు అందించేందుకు కృషిచేస్తామన్నారు. అలాగే బీటీ, సీసీ, గ్రావెల్ రోడ్లు మంజూరుచేస్తామని తెలిపారు. ఐటీడీఏకు వచ్చే నిధుల నుంచి సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ఉన్నత చదువులు, స్కాలర్షిప్లకు కేటాయిస్తామన్నారు. పేదలకు ఇండ్లను మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, సర్పంచ్లు పోటు సుమలత, బుర్స పోషమల్లు, చెన్న సోమశేఖర్, ఉప సర్పంచ్లు దేవానంద్, మల్రాజు శృతి, కొడిపె వెంకటేశ్, ఎంపీటీసీలు దుర్గం శ్రీవాణి, లావుడ్య సాగరమ్మ, సంఘం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్రెడ్డి, గ్రామస్తులు జంగు పటేల్, మధూకర్గౌడ్, రాజేశ్వర్, నాయకులు దుర్గం రవీందర్, జుమ్మిడి ఆనందరావు, ఎర్గటి సుధాకర్, ఇప్ప భీమయ్య తదితరులు పాల్గొన్నారు.