ఆనాడు నీళ్ల కోసం బిచ్చమెత్తుకొన్నం
సమైక్య పాలకులు ఎన్నడూ పట్టించుకోలే
యాభై ఏండ్ల క్రితం కాల్వ నిండుగ ఉండేది
కొండపోచమ్మ నుంచి నీళ్లొస్తే మళ్లీ పాతరోజులే
‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
నిజామాబాద్, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నదీప్రవాహానికి అడ్డంగా కట్ట కట్టి.. ఎవుసానికి నీటిని తరలించిన గొప్ప చరిత్ర వందేండ్ల క్రితమే తెలంగాణ సొంతమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే భారీ నీటిపారుదల ప్రాజెక్టుగా నిజాంసాగర్, 1932 లోనే కాల్వల ద్వారా నీళ్లు అందించిందని గుర్తుచేసుకొన్నా రు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ప్రాణం పోసేందుకు కొండపోచమ్మ సాగర్ నుంచి జలాలను తరలించడం అద్భుతమని ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో పోచారం అభివర్ణించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టుతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
బాన్సువాడ ప్రాంతమంతా నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోకి వస్తుంది. నేను రైతుగా పంటలు సాగుచేశాను. మాకు కాల్వనుంచే సాగు నీరు వచ్చేది. యాభై ఏండ్ల క్రితం మా వద్ద రెండు కాలాలకు సరిపడా నీళ్లు దొరికేవి. నా కండ్లతో నిజాంసాగర్ కాల్వలో ఫుల్లుగా నీళ్లు చూసేది. రైతులంతా గుండె ధైర్యంతో పంటలు సాగు చేసుకొనేది. మాలాంటి రైతులకు నిజాంసాగర్ ప్రాజెక్టు బతుకునిచ్చే దేవాలయం లాంటిది. రైతులందరికీ నిజాంసాగర్ ప్రాజెక్టుతో భావోద్వేగ సంబంధం ఉంటుంది. నిజాంసాగర్ ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు. 1932లో నిజాం ప్రభుత్వమే కాలువల ద్వారా నీళ్లు అందించింది. ఆనాడు 2.72 లక్షల ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్నూర్, బాన్సువాడ, బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, భీమ్గల్ తాలూకా పరిధిలో రైతులు రెండు పంటలు అనుభవించేవారు. మంజీరపై మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు చిన్నవి, పెద్దవి 40 ప్రాజెక్టులు నిర్మించాయి. సమైక్య పాలనలో 30 ఏండ్ల క్రితం నిజాంసాగర్ మీద సింగూర్ ప్రాజెక్టును కట్టారు. సింగూర్ను కట్టిన నాటి నుంచి నిజాంసాగర్ను అంధకారం ఆవహించింది. ఒక్క పంటకు కూడా రైతులు నోచుకోలేదు. ఈ బాధలన్నీ కండ్లారా చూసిన వ్యక్తిని నేను.
తెలంగాణ వచ్చాక పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపిస్తున్నది?
నిజాంసాగర్ బోసి పోవడంతో పెద్ద రైతు లు బోర్లు వేసుకొని పంటలు సాగు చేశారు. కరెంట్ లేక వారు బాధలుపడ్డారు. ఎమ్మెల్యే గా టీడీపీ, కాంగ్రెస్ హయాంలో నీళ్లకోసం పోరాడాల్సిన పరిస్థితి. వేసుకొన్న పంటలు కాపాడటానికి, కొత్తగా పంటలు వేసుకోవడానికి నీటికోసం బిచ్చమెత్తుకునేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్.. నిజాంసాగ ర్ రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా పంటలు కాపాడటానికి సింగూర్ నుంచి నీళ్లు అందించారు. అడిగిన వెంటనే నీళ్లు వదిలారు.
గోదావరి జలాల తరలింపు ఎలాంటి ఫలితం ఇస్తుంది?
నిజాంసాగర్కు మంజీర ద్వారా నీళ్లు చేర డం కష్టంగా మారిన నేపథ్యంలో సీఎం కేసీ ఆర్ స్వయంగా కొత్త ఆలోచన చేశారు. కాళేశ్వరంతో కొండపోచమ్మ వరకు తెచ్చిన గోదావరి జలాలను మంజీరకు తరలించడం నిజం గా అద్భుతం. కొండపోచమ్మ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్కు నీళ్లను తరలించడం ద్వారా ఆయకట్టు రైతుల కల నిజం కాబోతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులకు శుభ పరిణామం. మాకందరికీ జల పండుగ లాంటిది. వానకోసం ఎదురు చూడకుండా.. పంటలు వేయాలా? వద్దా? అనే మీ మాంస లేకుండా రోహిణి కార్తెలోనే నారుమడి వేసుకునే వెసులుబాటు త్వరలోనే ఆయకట్టు రైతులకు దక్కనున్నది.