న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి 76వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సమావేశాలకు అధ్యక్షుడిగా అబ్దుల్లా షాహిద్ ఉన్నారు. అయితే ఇండియాలో తయారైన కోవీషీల్డ్ టీకా రెండు డోసులను తీసుకున్నట్లు ఆయన మీడియాతో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు దేశాలు ఈ టీకాను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బ్రిటీష్ కంపెనీ ఆస్ట్రాజెనికా రూపొందించిన టీకాను ఇండియాలోని సీరం సంస్థ కోవీషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్లపై వేసిన ప్రశ్న సాంకేతికమైనదని, అయితే తాను ఇండియాలో తయారైన కోవీషీల్డ్ టీకాను వేసుకున్నట్లు చెప్పారు. రెండు డోసులు వేసుకున్నానని, కోవీషీల్డ్ను ఎన్ని దేశాలు ఆమోదిస్తాయో తెలియదని, కానీ చాలా వరకు దేశాలు ఆ టీకాను వాడుతున్నట్లు షాహిద్ తెలిపారు. కోవిడ్ టీకాలకు డబ్ల్యూహెచ్వో అనుమతి తప్పనిసరిగా ఉండాలా అని వేసిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. జనవరిలో మరోసారి యూఎన్ సభ్య దేశాలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని షాహిద్ నిర్వహించాలనుకుంటున్నారు. వివిధ దేశాల్లో టీకా పరిస్థితిపై ఆ సమావేశంలో నిర్ణయించనున్నారు.