కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ అన్న మాటలివి. తన బాడీగార్డ్తో తానీ మాటలు చెప్పినట్లు అమ్రుల్లా.. డైలీ మెయిల్ అనే లండన్ పత్రికలో రాసిన కాలమ్లో వెల్లడించారు. ఈ యుద్ధంలో నేను గాయపడితే నా తలలోకి రెండుసార్లు కాల్చండి. నేను తాలిబన్లకు లొంగిపోవాలని అనుకోవడం లేదు అని నా బాడీగార్డ్లతో చెప్పాను అని అమ్రుల్లా చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో దేశాన్ని వదిలి వెళ్లిన నేతలు.. తమ మాతృభూమికి నమ్మకద్రోహం చేశారు. కాబూల్ను తాలిబన్లు ఆక్రమించగానే అక్కడి పోలీస్ చీఫ్ నాకు ఫోన్ చేశారు. జైల్లో తిరుగుబాటు మొదలైంది. తాలిబన్ ఖైదీలు బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు. అప్పుడు నేను తాలిబన్ వ్యతిరేక ఖైదీలతో ఓ నెట్వర్క్ ఏర్పాటు చేసి తిరుగుబాటును అణిచేయాలని ఆదేశించాను అని అమ్రుల్లా వెల్లడించారు.
కాబూల్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లగానే తాను రక్షణ మంత్రి, హోంమంత్రికి ఫోన్ చేయడానికి ప్రయత్నించినా వాళ్లు అందుబాటులోకి రాలేదని, ఎలాగోలా మాబ్ కంట్రోల్ యూనిట్ సాయంతో జైల్లో తిరుగుబాటును అణిచేసినట్లు చెప్పారు. కాబూల్ మొత్తంలో ఆ రోజు ఒక్క ఆఫ్ఘన్ సైనికుడూ తనకు కనిపించలేదని తెలిపారు. అప్పుడే తాను కాబూల్ పోలీస్ చీఫ్కు ఫోన్ చేసి తాలిబన్లను ఎదురించాలని ఆదేశించినా.. ఆయన కోసం తాను ఆర్మీని మోహరించలేకపోయినట్లు అమ్రుల్లా వివరించారు. చివరికి రాష్ట్రపతి భవన్ నుంచి కూడా తనకు ఎలాంటి సాయం అందలేదని చెప్పారు. ఇక ఆ తర్వాతే ఇంటికి వెళ్లి తన భార్యా, పిల్లల ఫొటోలు కనిపించకుండా చేసి.. తిరుగుబాటు కోసం పంజ్షిర్ వెళ్లినట్లు అమ్రుల్లా తెలిపారు. అయితే ఈ యుద్ధంలో తనకు అండగా ఉంటానని కొందరు నమ్మించి మోసం చేయడంతో తాను దేశం విడిచి వెళ్లినట్లు చెప్పారు.